Monday, May 20, 2024

నిమ్స్‌ కాంట్రాక్టు నర్సుల సమస్యలను పరిష్కరించాలే.. హరీష్‌రావుకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నిమ్స్‌ ఆసుపత్రిల్లో కాంట్రాక్టు నర్సుల సమస్యలను పరిష్కరించాలని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుకు బహిరంగ లేఖ రాశారు. ‘ ఆసుపత్రుల్లో నర్సుల పాత్ర కీలకం. 423 మంది స్టాప్‌ నర్సులు పది రోజులుగా విధులు బహిష్కరించి ఎర్రటి ఎండలో ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని , ఇది దుర్మార్గం. ప్రసూతి సెలవులు, జీతాలు ప్లేస్లిప్‌లు ఇవ్వకపోవడం కట్టు బానిసత్వం కిందకు వస్తుంది.

నర్సుల ఆందోళనపై నిమ్స్‌ యాజమాన్యం, ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోకపోవడం అన్యాయం. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తూ సేవలందిస్తున్న నర్సుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ‘ అని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నర్సుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఆందోళనను విరమింప చేయాలని లేదంటే ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement