Tuesday, April 30, 2024

WGL: టెంపుల్ ఓపెనింగ్ కోసం సర్పంచ్ పదవి వేలం.. రూ.9.35 లక్షలకు సర్పంచ్ ఎన్నిక

భూపాలపల్లి, (ప్రభ న్యూస్) : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కోడ్ ను అమలు చేస్తుంది. కాగా గుంపుల కొద్ది జనం ఒక్క దగ్గర గుమకూడి ఉండకూడదు. ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు.. దీనికి విరుద్ధంగా నిబంధనలు ఉల్లంఘించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన కొంతమంది కుల పెద్దలు టెంపుల్ ప్రతిష్టాపన కార్యక్రమానికి కావలసిన ఖర్చులకోసం ఏకంగా సర్పంచి పదవిని వేలం వేశారు.

గ్రామస్తుల కథనం ప్రకారం.. మోగుల్లపల్లి మండలం అంకుషాపురం గ్రామంలో ఇటీవల పోచమ్మ తల్లి టెంపుల్ ను కొత్తగా కట్టారు. టెంపుల్ ప్రతిష్టాపనకు నవంబర్ 22న ముహూర్తం ఫిక్స్ అయింది. దీనికి కావాల్సిన ఖర్చులకు సరిపడా డబ్బులు లేకపోవడంతో కొంతమంది గ్రామంలోని పెద్ద మనుషులు హనుమాన్ టెంపుల్ సమీపంలో కూర్చుని సర్పంచ్ పదవికి వేలంపాడారు. మూడు లక్షలతో మొదలైన వేలంపాట రూ.9 లక్షల 35 వేలతో ముగిసింది. ఈవేళ పాటలో దాదాపు ఆరుగురు పాల్గొన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పంచాయతీ సెక్రెటరీ సునీత రెడ్డి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పై విషయాన్ని మండల నోడల్ ఆఫీసర్ (ఎంపీడీవో) కృష్ణవేణికి సమాచారం అందించగా ఆమె వెంటనే స్థానిక ఎస్సై శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎస్ఐ సిబ్బందిని పురమాయించగా ఘటన స్థలంలో ఎవరు లేకపోవడంతో వేలంపాట నిర్వహణ గ్రామంలో ఎంక్వయిరీ చేసినట్లు తెలిసింది.


ఈ విషయంపై ఎంపీడీవోను వివరణ కోరగా.. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి జనం ఒక్క దగ్గర కూడి వేలంపాట నిర్వహించిన మాట వాస్తవమేనని జిపి సెక్రెటరీ సమాచారం ఇచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. సర్పంచి పదవి కాలం పూర్తికి ఇంకా రెండు నెలలు ఉన్నప్పటికీ ముందే ఆ పదవికి వేలంపాట నిర్వహించడం మండలంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాశంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఓటుతో ప్రజా ప్రతినిధులు ఎన్నుకోవాలి తప్ప.. వేలం పాట వేయడం సరైంది కాదని.. ఇలాంటి ఘటనలపై ఉన్నత స్థాయి ఆఫీసర్లు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement