Thursday, May 2, 2024

TS : భరోసా ఇచ్చేందుకే రైతు దీక్ష ….బండి సంజయ్…

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ః కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో రైతులతో కలిసి బండి సంజయ్ ‘రైతు దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు…రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని, పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యమెందుకని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో రైతులకు భరోసా ఇచ్చేందుకే ‘రైతు దీక్ష’’ చేపట్టినట్లు చెప్పారు..అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చేతులెత్తేసిందన్నారు. వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయని వెంటనే బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు తీసుకురాలేదన్నారు. చేతికందిన పంట నీళ్లపాలైందన్నారు. అకాల వర్షాలకు రాలిపోయిన మామిడి పిందెలను, రాలిన వడ్ల కంకులను మీడియా ముందు చూపించారు సాగునీరు లేక పంట ఎండిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? తక్షణమే ఎకరాకు రూ.10 వేల సాయం ప్రకటించిన ప్రభుత్వం ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నారని, రూ.10 వేల సాయం సరిపోదని, తక్షణమే ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాల్సింద‌న్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా తక్షణమే వడ్ల కొనుగోలు చేయాలనని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement