Friday, April 26, 2024

సాయితోపాటే వారిపైనా కేసు పెట్టాలిః ఆర్పీ పట్నాయక్

టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన.. అతడిపై నమోదైన పోలీసు కేసు గురించి స్పందించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్టు సాయితేజ్‌పై కేసు పెట్టినట్టుగానే, రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్ కంపెనీపైనా, ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేయకుండా ఇసుక పేరుకుపోయేందుకు కారణమైన మునిసిపాలిటీపైనా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకసారి ఇలా కేసులు పెడితే మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడతారని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాగా, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి 8.05 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు అక్కడి సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బైక్‌పై వేగంగా వెళ్తుండడంతో నియంత్రించలేక అదుపుతప్పి కిందపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు. దీంతో తలకు తీవ్రమైన గాయలు కాలేదు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

ఇది కూడా చదవండిః వెంటిలేటర్ పై సాయి ధరమ్ చికిత్స.. వైద్యులు ఏమన్నారంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement