Thursday, May 2, 2024

వరి విత్తనాలు నిషేధిత జాబితాలో చేర్చారా..? ప్ర‌శ్నించిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యాసంగి వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్‌ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున వాదనలను అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వినిపించారు. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్‌ మౌలిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్న పిటిషనర్‌ పేర్కొన్నారు. సిద్దిపేట కలెక్టర్‌, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా పిటిషనర్‌ చేర్చారు. వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబిషన్‌ యాక్టులో ఏమైనా చేర్చారా అని హైకోర్టు ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. అలాంటి చర్యలు ఏమి ప్రభుత్వం తీసుకోలేదని, ఇకపై కూడా తీసుకోబోదని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలివ్వనప్పుడు, ఇచ్చేందుకు అవకాశమే లేనప్పుడు కలెక్టర్‌ ఎలా వ్యాఖ్యలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కలెక్టర్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు, ఈ కేసులో క్రిమినల్‌ కంటెంట్‌ కనబడుతోందని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశించంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement