Sunday, May 19, 2024

Revanth: మోడీ, కేడీ ఇద్దరు ఒక్కటే… ప్రగతిభవన్ గోడలు బద్దలు కొడుతా!

వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మంటలు చెలరేగుతున్నాయి. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోల చేయాలని సీఎం కేసీఆర్ ఓవైపు ధర్నా చేస్తే.. తెలంగాణ‌లో వ‌డ్లు కొనుగోలు చేసేది లేద‌ని కేంద్రం స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ 48 గంట‌ల డెడ్‌లైన్‌కు స్పందించిన కేంద్రం..  బాయిల్డ్ రైస్ ఈసారి కొనుగోలు చేయ‌బోమ‌ని తెలంగాణ‌కు ముందే చెప్పామని పేర్కొంది.

ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం ద్వంద వైఖరిని అనుసరిస్తున్నాయని రేవంత్ అన్నారు.  వ్యవసాయ కమిషనర్ కు రైతుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చామన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. జేఏసీ అంటే..జాయింట్ ఆక్టింగ్ కమిటీ అని పేర్కొన్నారు. 3లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టామన్న గొప్పలు చెప్పే సీఎం కేసీఆర్.. పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద కెసిఆర్.. రైతుల పక్షాన మాట్లాడుతాడో అని ఎదురు చూశామన్నారు. ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా? అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. టీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కళ్ళల వద్దకు వెళ్లాలని చెప్పారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు.

బండి సంజయ్, కిషన్ రెడ్డి.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోడీని నిలదీయాలని డిమాండ్ చేశారు. బిజేపి, టీఆరెఎస్ వాళ్లు.. డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో వుందన్న రేవంత్.. ఆ సినిమాలో రౌడీలా తయారయ్యారని అన్నారు. ఒకరినొకరు కొట్టుకున్నట్లు చేసి ప్రజలను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సహారా కుంభకోణంలో కెసిఆర్ ను కేంద్రమే కాపాడుతుందన్నారు. తాను చేసిన ఫిర్యాదులు తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు.

ఈ నెల 29 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ధాన్యం కోనుగోలు అంశాన్ని లెవనెత్తుతామని చెప్పారు. కరువు వస్తే కాపాడడానికిi గోదాములను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ గుర్తు చేశారు. ఖరిఫ్ ధాన్యం కొంటారా? లేదా? అని అడుగుతుంటే.. యాసంగి పంట ముచ్చట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మోడీ, కేడీ ఇద్దరు ఒక్కటే అని అన్నారు. అదాని, అంబానీల కోసమే మోడీ సర్కార్ అని చెప్పారు. వరి పంట కొనకుండా.. అదానీ, అంబానీ పాట పాడుతున్నారని విమర్శించారు. రేపటి నుంచి కల్లాలోకి కాంగ్రెస్ ఉద్యమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23 వరకు కల్లల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. రేపు తాను కామారెడ్డి కలాల్లోకి వెళ్లి రైతులతో ఉంటానని వెల్లడించారు. ఈ నెల 23 వరకు కేసీఆర్ కు డెడ్ లైన్ విధించారు. 23 తర్వాత రైతులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పారు. ప్రతి గింజ కొనే వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదన్న రేవంత్.. కేసీఆర్ ధాన్యం కొనకపోతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం రేవంత్ హెచ్చరించారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: TRS Mahadharna: కేంద్రంలో దిక్కుమాలిన సర్కార్.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే ఘోరం

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement