Tuesday, April 30, 2024

స‌మ‌యానికి విధులకు హాజరుకాక‌పోతే కొత్త‌వారిని నియ‌మిస్తాం.. క‌లెక్ట‌ర్

వికారాబాద్ (ప్రభ న్యూస్): నేటి మధ్యాహ్నం 12.00 గంటలలోగా విధులకు హాజరు కాని సెక్రెటరీల స్థానంలో ప్రత్యామ్నాయంగా కొత్త వారిని నియమించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అనధికార గైర్హాజరు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు
అనధికార గైర్హాజరు నేపథ్యంలో ఈరోజు అనగా శనివారం ( 13-05-2023) మధ్యాహ్నం 12.00 గంటల లోగా విధులకు హాజరుకావాలని, హాజరైన వారిని మినహాయించి, హాజరుకాని సెక్రెటరీల జాబితా సిద్ధం చేసి వారి స్థానంలో తాత్కాలిక నియామకాలు ఆదివారం సాయంత్రం వరకు చేపట్టాలని ఆదేశించారు.

ఏ గ్రామంలోనైతే సెక్రెటరీలు విధులకు హాజరు కాలేరో సదరు సెక్రటరీల స్థానంలో అదే గ్రామానికి చెంది డిగ్రీ పూర్తి చేసి , కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని కొత్త సెక్రెటరీలుగా తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గతంలో నిర్వహించిన రిక్రూట్మెంట్ ఆధారంగా వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి ప్రాధాన్యతను ఇచ్చి ఎంపిక చేయాలని సూచించారు. అన్ని మండలాలలో ఎంపీడీవోలు, తహసిల్దారులు, మండల సూపర్వైజర్లు, ఎంపీఓలు, ఏపిఎం లు సంబంధిత గ్రామ సర్పంచులు, ఉప సర్పంచు లతో సంప్రదించి హాజరుకాని గ్రామ కార్యదర్శుల స్థానంలో ఆదివారం రోజు గ్రామ సభలు నిర్వహించి డిగ్రీ విద్యతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం గల అదే గ్రామానికి చెందిన అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి తీర్మానం ప్రకారం ఎస్సీ స్థానంలో ఎస్సీలకు, ఎస్టీ బీసీ స్థానాల్లో అట్టివారిని నియామకం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్, తాండూర్ ఆర్డీవోలు విజయ కుమారి, అశోక్ కుమార్, అందరు జిల్లా అధికారులతో పాటు ఎంపీడీవోలు, తాసిల్దారులు, ఎంపీ ఓలు, ఏపియంలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement