Wednesday, May 8, 2024

TS | సమ్మె వీడి, విధుల్లో చేరండి.. పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి

సిద్ధిపేట బ్యూరో (ప్ర‌భ న్యూస్‌): ‘‘వ‌ర్షాలు కురుస్తున్న‌ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపిస్తాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుంది. సీజనల్ వ్యాధులు ప్రబలే దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలి’’ అని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచారని మంత్రి హ‌రీశ్ గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయన్నారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో చర్చలు జరిపి తప్పకుండా వీలైనంత త్వరితగతిన సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి అందరూ పని చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వాలలో 500, 1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బతకాలనే ఉద్దేశ్యంతో అడగకుండానే 8,500 రూపాయలకు పెంచారు. అలాగే అడగకుండానే ఈ మధ్యే 8, 500 నుంచి 9, 500కు పెంచిన మనసున్న మనిషి కేసీఆర్ అని తెలిపారు.

- Advertisement -

బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో పారిశుధ్య కార్మికుల‌ను కనీసం మనుషులుగా కూడా చూడట్లేదని ఉత్తర ప్రదేశ్ లో 5, 200, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 5,200, ఛత్తీస్గఢ్ లో అసలు ప్రభుత్వం వేతనం ఇవ్వడం లేదని గ్రామ పంచాయతీలే తోచినంత ఇస్తున్నాయని తెలిపారు. ఒడిశాలో ఇంటికి 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, పశ్చిమ బెంగాల్ లో అయితే “పెయిడ్ వర్కర్స్” అని పెట్టి నెలకు కేవలం 500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని వివ‌రించారు. కేరళ శానిటేషన్ వర్కర్లు అని పెట్టి ఇద్దరికీ ఇంటికి కేవలం 30 రూపాయలు ఇస్తున్నారని, అంటే ఒక వార్డులో పని చేస్తే కనీసం 4 నుంచి 5 వేలు కూడా రాని పరిస్థితి ఉన్నదని మంత్రి హరీశ్ చెప్పుకొచ్చారు.

దేశమంతా ఇలాంటి పరిస్థితులు ఉంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి లాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకుని మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచేటట్లు చేశారని గుర్తు చేస్తూ.. ఈ విజయంలో గ్రామ పంచాయతీల సెక్రటరీలు, మల్టీపర్పస్ వర్కర్ల పాత్ర మరువలేనిదని అన్నారు. అందుకే వారిని అన్ని విధాలుగా గౌరవంగా తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నదని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

పనికి మాలిన రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడొద్దని సీఏం కేసీఆర్ మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తారని, ఏలాంటి సమ్మెలు, ధర్నాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ పల్లెలకున్న గొప్ప పేరును ఖరాబు చేయొద్దని పారిశుద్ధ్య కార్మికులను మంత్రి హరీశ్ రావు వేడుకున్నారు. అలాగే కొంత మంది క్వాలిఫైడ్ కార్మికులు “అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి” గా గుర్తింపు ఇవ్వాలని కోరినట్లు, దాన్ని కూడా సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హరీశ్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement