Monday, April 29, 2024

TS | కాలుష్య రహితంగా తెలంగాణ.. సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో 40కిలోవాట్ సోలార్ ప్లాంట్

తెలంగాణను కాలుష్య రహిత రాష్ట్రంగా చేయడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమని, ఆ దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ లైటింగ్ సిస్టమ్​ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్​ సతీష్​రెడ్డి. ఇవ్వాల (శుక్రవారం) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 40 కిలోవాట్ గ్రిడ్ అనుసంధానిత సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ ను సంస్థ జీఎం ప్రసాద్, సోలార్ విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.

ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకి 45,000 యూనిట్ల విద్యుత్ ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన 40 కిలోవాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ద్వారా నెలకి 5400 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం నెలకి రూ.1,25,000 విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు తర్వాత నెలకి రూ.54,000 విద్యుత్ చార్జీల భారం తగ్గనుంది. అంటే నెలకి రూ.71వేల వరకు మాత్రమే కరెంటు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

25 ఏళ్ల పాటు ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు రెడ్కో సంస్థే చూసుకోనున్నది. అంటే ఈ సోలార్ ప్లాంట్ ద్వారా ఏటా రూ.6,33,000 ఆదా కానున్నాయి. నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం నాలుగేళ్లలో తిరిగిరానుంది. ఈ సందర్భంగా రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ కాంప్లెక్స్ లు, ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు ప్రైవేటు నివాస, వాణిజ్య భవనాలపై కూడా సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహాన్ని ఇస్తోందన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోందన్నారు.

ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన లక్ష్యాల కంటే అదనంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ పాటు విద్యుత్ చార్జీల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్కో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మేనేజర్ పరమాచారి, హాస్పిటల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement