Sunday, May 19, 2024

మంత్రి మర్డర్​కు​ స్కెచ్​: రాఘవేందర్‌రాజు, రవి కస్టడీకి కోరుతూ పిటిషన్‌ వేసిన పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో నిందితులుగా ఉన్న ఏ1 రాఘవేందర్‌రావు, ఏ 5 మున్నూరు రవిలను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మేడ్చల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు ఇప్పటికే ఐదు రోజులు కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో ఎలాంటి సమాచారం రాకపోవడంతో మరోసారి మేడ్చల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ1 రాఘవేందర్‌రాజు, ఏ5 మున్నూరు రవిని మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించనుంది.

ఈ కేసులో ఏడుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు హత్యకు ఏ విధంగా కుట్ర చేశారన్న దానిపై లోతైన విచారణ జరుపుతున్నారు. మిగతా వారి ప్రమేయంపై కూడా దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే జితేందర్‌రెడ్డి డ్రైవర్‌కు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
కస్టడీ పొడిగింపు మంత్రి హత్యకు కుట్ర కేసులో నిందితులుగా ఉన్న వారి రిమాండ్‌ను మేడ్చల్‌ కోర్టు పొడిగించింది. నిందితులకు మరో 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంపై రాఘవేందర్‌రాజు, మున్నూరు రవి, అమరేందర్‌, మదుసూధన్‌, రాజులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement