Sunday, April 28, 2024

Phone Tapping – బిఆర్ఎస్ గుర్తింపు ర‌ద్దు చేయాల‌న్న కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి . ప్రయివేటు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని అన్నారు. హైదరాబాద్ నాంప‌ల్లిలోని బిజెపి కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పోలీసుల విచారణలో ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని తేలిందని పేర్కొన్నారు. దేశ భద్రతకు భంగం కలిగేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, సమాజాంలోని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. రాజకీయాలకు సంబంధం లేని వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లుగా వెల్లడవుతోందన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, ఫలితాలు కూడా తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ప్రతిపక్షాల ఫోన్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

- Advertisement -

ఉప ఎన్నికల సమయంలోనూ మా అభ్యర్థులు, నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కేసీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ అధినేతపై కఠినమైన చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement