Sunday, April 28, 2024

Palakurthi – కాంగ్రెస్ గెలిస్తేనే తెలంగాణలో అభివృద్ధి … ప్రియాంకా గాంధీ..

తెలంగాణాలో యువత కష్టాల్ని, త్యాగాల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వృథా చేసిందని, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, రైతుల కష్టాలు కడతేరలేదని, మహిళలకు రక్షణ లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుర్తి నియెజకవర్గంలోని తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గడచిన పదేళ్లల్లో తెలంగాణ యువ శక్తి నిర్వీర్యమైపోతోందన్నారు. ఉపాధి లేదు. ఉద్యోగాలు లేవు. పరీక్షలకు సిద్ధపడి, కష్టపడి చదివితే ప్రశ్నాపత్రాల లీకేజీలు నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీశాయని, ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటే .. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అవమానించిందన్నారు.


కాంగ్రెస్ పాలనలోని రాష్ర్టాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, రాజస్థాన్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, కర్ణాటకలోనూ ఉద్యోగాల భర్తీకి కృషి జరుగుతోందన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్ కేలండర్ విడుదల చేస్తామని, ఎన్ని ఉద్యోగలను భర్తీ చేస్తున్నాం, దరఖాస్తుల ఆఖరి తేదీ, పరీక్ష తేదీ, ఫలితాల తేదీ ముందుగానే వెల్లడి చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.


ఇక తెలంగాణ రాష్ర్టంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావని, అప్పులు పేరుకు పోయాయని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, భూమి లేని రైతులకు ఏటా రూ.12,000 ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఇక రైతుల భూములను తెలంగాణ ప్రభుత్వం కొల్లగొడుతోందని, భూ మాఫియా చెలరేగిపోతోందని, ఈ అక్రమాలను అడ్డుకుంటామని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.
ఇక మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం అని, పిల్లల ఆరోగ్యం, కుటుంబ సమస్యలతో తల్లడిల్లిపోతున్నారని, గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు, వైన్ షాపులు పెరిగిపోయాయని, మహిళల ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు నెలకు రూ.2,500లు మహిళల ఖాతాల్లో జమ చేస్తామని, పిల్లల చదువుకు ప్రతి విద్యార్థికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలను ప్రారంభిస్తామన్నారు. మహిళలకు రాష్టవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణాలో పురోభివృద్ధి ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement