Monday, May 6, 2024

TS | మంత్రి గంగుల ఎన్నికపై.. హైకోర్టుకెళ్లిన బండి సంజయ్‌

హైదరాబాద్‌ , ఆంధ్రప్రభ : మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నిక చెల్లదంటూ కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. 2018 లో జరిగిన ఎన్నికల్లో గంగుల కమలాకర్‌ అవకతవకలకు పాల్పడ్డారని, పరిమితికి మంచి ఖర్చు చేశారని, తదితర ఆరోపణలతో బండి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 27 కి వాయిదా వేసింది. ఈ విచారణకు బండి సంజయ్‌ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. తన న్యాయవాదికి అవసరమైన వివరాలను అందించారు. ఇదిలా ఉండగా, బండిసంజయ్‌ ఎన్నిక చెల్లదని కాంగ్రెస్‌ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు విచారించింది. ఆయన పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 13 కి వాయిదా వేసింది.

బీఆర్‌ఎస్‌కు కోకాపేటలో భూకేటాయింపుపై హైకోర్టులో పిటిషన్‌
రాజేంద్రనగరం నియోజకవర్గం పరిధిలోని కోకాపేట పంచాయతీ పరిధిలో బీఆర్‌ఎస్‌కు భూకేటాయింపులు జరపడాన్ని నిలుపుదల చేయాలని అభ్యర్థిస్తూ ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జిజి ) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌ ) దాఖలు చేసింది. రూ. 50కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 3.41 కోట్లకే కేటాయించారని, అంతేగాక ఇప్పటికే బంజారాహిల్స్‌లో ఖరీదైన భూమిని బీఆర్‌ఎస్‌కు కేటాయించారని,రెండు చోట్ల ఖరీదైన భూమిని పొందడం నిబంధనలకు విరుద్ధమని తన వ్యాజ్యంలో కోర్టుకు నివేదించింది. తన పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్స్‌టిట్యూూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ డెవలప్‌మెంట్‌ పేర భూమి కేటాయించారని తెలిపారు. ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే భూమి పూజ చేశారని, నిర్మాణపు పనులు కూడా జరుగుతున్నాయని, నిర్మాణాల నిలుపుదలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని , బీఆర్‌ఎస్‌కు భూకేటాయింపు జీవోను రద్దు చేయాలని అభ్యర్థించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement