Thursday, April 25, 2024

Dog Attack : మ‌రోసారి రెచ్చిపోయిన వీధి కుక్క‌లు.. 13 మందికి తీవ్ర గాయాలు..

ఉమ్మడి నిజామాబాద్, ప్రభన్యూస్ బ్యూరో : పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. దారి వెంట వెళ్లే 13 మందిపై దాడి చేశాయి. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో మధ్యాహ్నం పనులపై బయటికి వచ్చిన 13 మంది పై వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఇందులో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తొడలు, ముఖం, చేతుల భాగాల్లో కుక్కలు కరిచాయి. ఓ మహిళకు చెంప మాంసం ఊడిపోయింది. ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా స్థానిక మెండోరా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇద్దరికీ తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికంగా తాత్కాలిక చికిత్స అందించి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలించారు. అనేక రోజులుగా కుక్కలు పెరిగి పాదాచారులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ స్థానిక గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో మెండోరాలో విపరీతంగా కుక్కలు పెరిగిపోయాయి. ఇటీవల కాలంలో పలుచోట్ల కుక్కల దాడిలో పిల్లలు మృతిచెందగా అనేకమంది గాయపడిన సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ మెండోరా గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక ప్రజలు గ్రామపంచాయతీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement