Thursday, May 2, 2024

KTR: అలవికాని హామీలు ఇవ్వ‌డ‌మే కాంగ్రెస్ నైజం… ప్ర‌జ‌ల‌లో ఎండ‌గ‌ట్టాల‌ని కెటిఆర్ పిలుపు

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అన్నారని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో నేడు జరిగిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడేమో ఆయ‌న కేబినెట్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రుణాలు వసూలు చేయాలని ఆదేశాలు జారి చేశారని అన్నారు.

లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నార‌ని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైందన్నారు. నోటికి ఎంత వస్తె అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. అందుకే 420 హామీలను చేసేదాకా విడిచి పెట్టబోమని కేటీఆర్ అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతుందన్నారు.

ఇంకా కెటిఆర్ ఏమ‌న్నారంటే..
“గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు.
అందుకే స్వేద పత్రం విడుదల చేశాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచాం. గణాంకాలు, ఆధారాలతో సహా వివరించాం.
ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి గారు భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారు. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాహుల్ గాంధీ నిన్ననే అదానీని తిడితే, రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్ లో ఒప్పందం చేసుకున్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నారు.
కేసీఆర్ , హరీశ్ రావు ల‌ నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాం . ఈసారి కూడా మెదక్ లో గులాబీ జెండా ఎగరబోతున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత పదేళ్ళలో తెలంగాణ తరుపున గళం విప్పింది మన బీఆర్ఎస్ ఎంపీలు అనే విషయం మరచి పోవద్దు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే. మన బలం, మన గళం, మన గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలి. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని, ఇదే విషయం ప్రజలకు చెప్పాలి. నిరాశ వీడాలి. బయటికి రావాలి అంటూ పిలుపు ఇచ్చారు..
ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు హైదరాబాద్‌లో కూడా వేల కోట్ల రూపాయల ఆస్తులు సృష్టించి బంగారు తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగించినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ఇక నుంచి కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ గెలవడం కష్టం కాదని” కేటీఆర్ అన్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సునీతా లక్ష్మా రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement