Tuesday, April 30, 2024

31న జెపి నడ్డా బహిరంగ సభ .. ఒక్క సభకే బీజేపీ పరిమితం

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలొ జెపి నడ్డా ఈ నెల 31న వస్తానని హామీ ఇవ్వడంతో ఆ రోజున భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రాష్ట్ర బిజెపి ఏర్పాట్లు చేసుకుంటోంది. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోనే ఈ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నామని, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌నే సభా స్థలిపై తుది నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా ఎన్నికల ఖర్చును దృష్టిలో ఉంచుకుని ఒక్క బహిరంగ సభకే బిజెపి పరిమితం కానున్నట్ల చెబుతున్నారు. ఈ ఒక్క బహిరంగ సభకే ఎంత లేదన్నా సుమారు రూ. 12 నుండి 20 లక్షల వరకు ఖర్చు కానుందని, ఇలాంటి సభలు ఒకటి రెండు నిర్వహిస్తే ఖర్చు తడిసి మోపెడు అవుతుందని రాష్ట్ర బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ. 40 లక్షల దాటడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్‌ ఆదేశించడంతో ఒకే ఒక్క బహిరంగ సభకే పరిమితం అవుదామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నట్లు చెబుతున్నారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రస్తుతం ఎంఎల్‌ఏలు ఈటెల రాజేందర్‌ , రఘునందన్‌ రావు లాంటి వారు వాహనాలపై తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని అవసరమైతే తామ లాంటి నాయకులమే పాదయాత్రలను ఎంచుకుంటామని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement