Thursday, April 18, 2024

Delhi: జనసేనతో కలిసి పోటీ చేస్తాం, టీడీపీతో నో.. బీజేపీ ఏపీ ఇన్​చార్జి సునీల్ దేవధర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జనసేన – బీజేపీ కలసి పోటీచేస్తాయని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. తమ మిత్రపక్షం జనసేన బీజేపీకి దూరమై తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో దేవధర్ పార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన ‘దివాలి మిలన్’ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

బీజేపీ-జనసేన కూటమి తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీతో తాము గతంలో పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలు చవిచూశామని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని తేటతెల్లం చేశారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ అవినీతి, కుటుంబ పార్టీలేనని దేవధర్ విమర్శించారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై స్పందన కోరగా.. జనసేనతో రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, దాని గురించి అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు. అయితే రోడ్‌ మ్యాప్ గురించి మీడియాలో మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని కూడా తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య ఎలాంటి విబేధాలు లేవని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement