Friday, May 10, 2024

Suryapet: పాదయాత్రలో డప్పు కొట్టి… అరక దున్నిన భట్టి..

కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స మార్చ్ సూర్యపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. అందులో భాగంగా ఆయన పాదయాత్రలో డప్పు కొట్టి.. అరక పట్టి దున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుందన్నారు. బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీకి వేసినట్లే.. ఈ విషయాన్ని మైనారిటీలు మదిలో పెట్టుకోవాలన్నారు. లౌకిక పార్టీ కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే బీజేపీకి వ్యతిరేకంగా వేసినట్టు అవుతుందన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతోనే బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని మరోసారి స్పష్టమైందన్నారు.పార్లమెంట్ లో బీజేపీ తీసుకువచ్చిన అనేక చట్టాలకు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారన్నారు. భారత్ జోడో యాత్రకు భయపడి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని మోడీ రద్దు చేయించారన్నారు. దురుద్దేశంతోనే రాహుల్ గాంధీని క్వార్టర్స్ ఖాళీ చేయించారన్నారు. కేంద్రం ఎలాంటి చట్టాలు తీసుకువచ్చినా… మద్దతు తెలుపుతూ బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్రలో భాగమే బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం ప్రకారం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు.


తెలంగాణలో 50% ఉన్న బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం ఐదు శాతం నిధులు కేటాయించి గొర్లు, బర్లు, చేపలంటూ దగా చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం నిధులు కేటాయిస్తాం.. బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. నియామకాలు లేకపోవడంతో యూనివర్సిటీలు నిరుద్యోగులకు కేంద్రాలుగా మారాయన్నారు. రైతులు, నిరుద్యోగులు, చేతివృత్తులు, కుల వృత్తుల వాళ్లు అందరూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతుబంధు మాత్రమే ఇచ్చి, రైతుకు మిగిలిన అన్ని రకాల సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందన్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యంను కొనే దిక్కులేదు.. కాంట వేసిన ధాన్యానికి క్వింటాకు 12 కిలోల తరుగు ఇదేనా రైతు ప్రభుత్వమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. సూర్యాపేట ప్రజల స్పందన చూస్తుంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు వార్షిక క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. ఇల్లు లేని బీదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు కూలీ బంధు ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల సంపద ప్రజలకే చెందేలా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement