వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ‘మొక్క’వోని ప్రేమ చాటుతున్నారు. 2016 జూలై 29న వెంకటయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి తాండూరు పట్టణంలోని తాము నివసిస్తున్న ఇంటి ముందు ఆమె ఓ మొక్క నాటారు. వెంకటయ్య అనారోగ్యం పాలై 2017 ఏప్రిల్ 5న మరణించారు. తన భర్త బర్త్డే సందర్భంగా నాటిన మొక్కకు ఏటా కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆరు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో చెట్టును జేసీబీ సహాయంతో వేర్ల నుంచి పెకిలింపజేశారు. దాన్ని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నాటారు. ఈసారి ఆ చెట్టుకే జన్మదిన వేడుకలు నిర్వహించి అన్నదానం చేశారు
విషయం తెలుసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఆమెతో ఫోన్లో మాట్లాడి అభినందించారు.
ఈ సందర్భాన్ని ట్విట్టర్లోనూ పంచుకున్నారు. ప్రతి మనిషి జీవితంలో బంధం, అనుబంధం, వాటి జ్ఞాపకాలు మనుషుల్ని నడిపిస్తుంటాయని, అయితే అందరూ తమకు ఇష్టమైన వ్యక్తుల జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకుంటే.. కొందరు వాటికి రూపం ఇచ్చి ఆరాధిస్తుంటారని ఎంపీ సంతోష్ తెలిపారు. జీవితం ఉన్నంత వరకూ ఇష్టపడ్డ వ్యక్తుల జ్ఞాపకాలు ఉంటాయని, వారు గుర్తొచ్చిన ప్రతిక్షణం ఆ జ్ఞాపకాలు మన హృదయాన్ని కదిలిస్తుంటాయని చెప్పారు. అయితే, జ్ఞాపకాలను ప్రకృతితో మమేకం చేయాలనే ఆలోచన అద్భుతమని పేర్కొన్నారు. భర్త జ్ఞాపకాలను ఒక గుర్తుగానే మిగిలిపోనీయకుండా సమాజం బాగు కోసం ఆలోచించడం అరుదైన విషయమని విజయలక్ష్మిని అభినందించారు.
‘పది మంది బాగు కోసం బాధను కూడా పండుగలా మార్చడం, మొకను నాటి పెద్ద చేయటం.. మీ మానవత్వం సమాజంలోని మరింత మందికి ఆదర్శం’ అని ప్రశంసించారు. ‘మీరు చేసే ప్రకృతి సేవకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సదా అండగా ఉంటుందని సంతోష్ హామీ ఇచ్చారు. మానవ మనుగడకు అవసరమైన వృక్షాలను ప్రతి ఒక్కరూ నాటి సంరక్షించాలని కోరారు