Friday, May 17, 2024

సాహస వీర నారి మల్లు స్వరాజ్యం: మోత్కుపల్లి

మల్లు స్వరాజ్యం మృతి పట్ల ప్రగాఢ సంతావం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. కట్టుబాట్లు, సాంప్రదాయాలతో ఆడ పిల్లల పట్ల కఠిన ఆంక్షలు బుసలు కొడుతున్న సమాజంలో తెలంగాణ స్వేచ్చా వాయువుల కోసం పదిహేను ఏళ్లు కూడా నిండని ఓ బాలిక పోరుబాట పట్టిందని అన్నారు. ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తూ కరుడుగట్టిన రజాకార్లను నిలువరించి నిజాం సర్కారుకు నిద్రపట్టకుండా చేసిన తొలి సాహసోపేత వీర నారి మల్లు స్వరాజ్యం అని కొనియాడారు. తెలంగాణ సాయుధపోరాటంలో జరిగిన ఘటనలను సువర్ణాక్షరాలతో లిఖించాల్సి వస్తే అందులో మల్లు స్వరాజ్యం చరిత్రను ముందుగా లిఖించాలన్నదే తన అభిమతం అని చెప్పారు. సాయుధ పోరాటం అనే పదం తెలంగాణ చరిత్రలో ఉన్నంత వరకూ మల్లు స్వరాజ్యం పేరు కూడా చరిత్రలో మిగిలిపోతుందని చెప్పారు. భావితరాలకు మల్లు స్వరాజ్యం జీవితాన్ని ఓ సాహసోపేత చరిత్రగా అందించాలని ఆయన కోరారు. ఉన్నత కుటుబం నుంచి వచ్చినప్పటికి బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికోసం అహర్నిషలు శ్రమించిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని కొనియాడారు. ఆమె అత్మకు శాంతి చేకూరాలని, మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement