Friday, May 10, 2024

వరి నాట్లు వెయ్యమన్న బండి సంజయ్ ఎక్కడ?

యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని చివరిగింజ కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మెదక్ పట్టణంలో తెరాస పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంజాబ్ తరహాలో తెలంగాణలో యాసంగిలో పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. తెలంగాణ రైతాంగం కోసం సీఎం కేసీఆర్ గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పంటల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం పండిన ధాన్యాన్ని కొనకపోవడం రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణలో పండించేది పంట పంట కాదా? అని ప్రశ్నించారు. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని, వాటికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయలేదని మండిపడ్డారు.

బీజేపీ నాయకులు ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. గల్లీలో ఉన్న నాయకులు ఢిల్లీలో ఉన్న నాయకులు ఒప్పించి తెలంగాణలో యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని సూచించారు. రైతుల కోసం ప్రభుత్వంలో ఉండి కూడా రైతుల కోసం ఉద్యమాలు చేస్తున్నామన్నారు. వరి నాట్లు వెయ్యమన్న బండి సంజయ్.. కేంద్రంతో మాట్లాడి వడ్లు కొనుగోలు చేయించాలి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement