Monday, April 29, 2024

తొమ్మిదేండ్ల స్వల్ప వ్యవధిలోనే సుస్థిరమైన ఆర్థిక ప్రగతి – మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్,సెప్టెంబర్ 17 (ప్రభ న్యూస్):తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9 ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం తో పాటు, జిల్లాలో సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి సందేశమిస్తూ సమాజంలోని బడుగు ,బలహీన, పేదల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం రైతుబంధు ,రైతు బీమా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, అమ్మఒడి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్లు ,గొర్రెల పంపిణీ ,ఉచిత చేప పిల్లల పంపిణీ, దళిత బంధు ,బీసీ లకు ఆర్థిక సహాయం, గృహలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భావనాలను నిర్మించడమే కాక, విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం ,అదేవిధంగా జిల్లాకో మెడికల్ కళాశాల వంటివి ఏర్పాటు చేస్తున్నదని అన్నారు.వ్యవసాయంలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు, పాలమూరు కరువు ను శాశ్వతంగా తొలగించాలన్న ఉద్దేశంతో 35200 కోట్ల రూపాయలతో చేపట్టిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం ప్రారంభించారని, ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కరివేన రిజర్వాయర్ నుండి సాగునీటిని తీసుకువచ్చి జిల్లా మొత్తం సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో రెండు లక్షల 18వేల ఎకరాల సాగు ఉండగా, గత 9 సంవత్సరాలలో సాగు విస్తీర్ణం మూడు లక్షల 50 వేల ఎకరాలకు పెరిగిందని తెలిపారు.పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిలో భాగంగా పల్లె ప్రగతి పథకాన్ని తీసుకువచ్చి అన్ని గ్రామ పంచాయతీలను పటిష్టం చేయడం జరిగిందని, జిల్లాలోని 441 గ్రామపంచాయతీలలో ఈ పథకం కింద 330 కోట్లు విడుదల చేశామని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో అన్ని వర్గాల వారు కలిసి ముందుకు రావాలని, భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం పాఠశాల, కళాశాల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా మంత్రి స్వతంత్ర సమరయోధులు వకీల్ భీమయ్యను శాలువా, పూలమాలతో సత్కరించారు. అంతేకాక వివిధ శాఖలు వారి అభివృద్ధిని తెలిపే విధంగా ఏర్పాటు చేసినాను స్టాళ్లను మంత్రి పరిశీలించారు.

జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, ఎస్పీ కే. నరసింహ,దేవరకద్ర ఎం ఎల్ ఏ ఆల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, రైతుబంధు జిల్లా అద్యక్షులు గోపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, అదనపు కలెక్టర్లు మోహన్ రావు, యాదయ్య, అడిషనల్ ఎస్పి రాములు ,డిఆర్ఓ కెవివి రవికుమార్, ఆర్డిఓ అనిల్ కుమార్ ,జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement