Monday, April 29, 2024

TS : రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త కేసీఆర్‌దేః మంత్రి పొంగులేటి

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దుయ్యాబ‌ట్టారు.
ఆదివారం ఖ‌మ్మం జిల్లాలోని కల్లూరులోని అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళ్ల‌ర్పించారు. అనంత‌రం ఖమ్మం జిల్లా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరానియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

- Advertisement -

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దేశం గర్వించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నతమైన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు పేదల దరిచేరుతున్నాయంటే దానికి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగమే ముఖ్య కారణామన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. నీటి కొరతకు అప్పటి బీఆర్ఎస్ పాలకుల విధానాలే కారణమని మండిపడ్డారు.

ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఎంతటి పెద్దవారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. తప్పు చేసిన వారు ఊచలు లెక్కపెట్టడం ఖాయమన్నారు. విద్యుత్తు కొనుగోలులో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.

దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా పదవిని వదిలేసిన మహానేత రాహుల్ గాంధీ అని పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించవలసిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుందని మంత్రి పొంగులేటి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement