Saturday, May 4, 2024

నిధులాపితే తిరుగుబాటే.. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక

గజ్వేల్‌, ప్రభన్యూస్‌: తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఎఫ్‌ఆర్‌బీఎం నిధులను కావాలనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపివేసిందని, కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్‌ నిధులు ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను బీజేపీ ఇబ్బంది పెడితే తెలంగాణ సమాజం తిరగ బడుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీ శ్‌రావు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని గజ్వేల్‌, సిద్దిపేటలో తిరుగుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లిdలో తీర్మాణంచేసి కేంద్రానికి పంపామని, ఆ పని చేసుకొచ్చి ముఖం చూపిస్తే బాగుంటుందని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. బాయిల వద్ద మోటార్లు పెడితే 25వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశ చూపిందని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాయిల వద్ద మోటార్లు పెట్టేది లేదని రైతులకు కష్టం తెచ్చేదిలేదని కరాకండిగా తేల్చిచెప్పారన్నారు.

ఎఫ్‌సీఐతో బియ్యం కొనకుండా తెలంగాణలో రైస్‌మిల్లులపై దాడులుచేసి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని పార్టీ బీజేపీ. వరంగల్‌ లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఆపివేసి ఆ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తీసుకెళ్ళిందన్నారు. కేంద్రం లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని మంత్రి డిమాం డ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఖాళీగా లేకుండా అన్ని నింపుతామని చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్‌ ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రారంభించారన్నారు.

వందలాది దరఖాస్తులు పెట్టుకు న్నా తెలంగాణకు మెడికల్‌ కళాశాలలు, నవో దయ పాఠశాలలు మంజూరు కాకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, సీఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్‌, సిద్దిపేట, మెదక్‌ జడ్పీ చైర్మన్లు వేలేటి రోజారాధాకిషన్‌శర్మ, హేమలతశేఖర్‌గౌడ్‌, రాష్ట్ర మెడికల్‌ అండ్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ చైర్మన్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌, రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌, మాజీ బేవరైజెస్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ దేవిప్రసాద్‌, రాష్ట్ర ఆహార సంస్థ మాజీ కార్పోరేషన్‌ చైర్మన్‌ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement