Wednesday, May 1, 2024

ఉత్త‌రానికి ఒక నీతి, ద‌క్షిణానికి ఒక నీతిగా కేంద్రం తీరు : హ‌రీశ్ రావు

కేంద్ర ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి, దక్షిణ భారత దేశానికి ఒకనీతిగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రూ.1 కోటి 71 లక్షలతో నిర్మించిన డివిజినల్ ఇంజనీర్ కార్యాలయ భవనం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయంను ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… హుస్నాబాద్ లో రూ.1.71 కోట్ల రూపాయలతో విద్యుత్ డీఈ కార్యాలయం ప్రారంభం చేసుకున్నామ‌న్నారు. హుస్నాబాద్ పరిసర ప్రాంత ప్రజలు గతంలో కరీంనగర్, సిద్దిపేట వెళ్లే పరిస్థితి ఉండేదని, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఇక నుంచి విద్యుత్ సమస్య పనులకు హుస్నాబాద్ లోనే చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. డీఈ అధికారి పోస్టు మంజూరుతో పాటు నూతన భవన ప్రారంభం చేసుకున్నామ‌న్నారు. అలాగే హుస్నాబాద్ నాగ సముద్రాల వద్ద 220/132 కేవీ సబ్ స్టేషన్ గతంలో మంజూరు చేసుకున్నామని, పనులు పూర్తి కావొచ్చాయని, రూ.50 కోట్ల తో నిర్మిస్తున్న సబ్ స్టేషన్ ను మార్చి 31వతేదీ లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిలకు మంత్రి ఆదేశించారు.

అదే విధంగా నూతనంగా నిర్మిస్తున్న రామవరం, సీసీ పల్లి సబ్ స్టేషన్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రామవరం సబ్ స్టేషన్ మార్చి 31లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామ‌న్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రైతులకు ఏమైనా మేలు చేస్తుందోనని ఎదురు చూస్తే.. కేంద్రం వైఖరి రైతులపై భారం వేయడం తప్ప, రైతులకు మేలు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతీ సంవత్సరం రాష్ట్ర జీఎస్ డీపీలో 4 శాతం అప్పు రూపేణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదని, కానీ ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3.5 శాతం రాష్టాలకు నేరుగా ఇస్తామని, మరో ఒక అర శాతానికి విద్యుత్ సంస్కరణలు తేవాలని నిబంధనలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు చట్టంలో రీఫామ్స్-సవరణలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానం ఒక్కటే.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ బాయిలకాడ మీటర్లు పెట్టనని, మీటర్లు పెడితే అర శాతం 5 వేల కోట్లు మన రాష్ట్రానికి రానట్లేనని, దీంతో తెలంగాణకు 5 వేల కోట్ల కోత పడినట్లేనని ఆర్థిక మంత్రి హరీశ్ వెల్లడించారు. ఒకప్పుడు 400 రూపాయలు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ నేరుగా బ్యాంకులో వేస్తామని, కేవలం యేడాది ఇచ్చి యేటా 6 సార్లు 2400 వరకూ ఇచ్చినట్లే ఇచ్చి, ఇవాళ 40 రూపాయలకు బీజేపీ దిగజారిందని వెల్లడించారు.

తెలంగాణ, దక్షిణ భారతదేశంపై కేంద్ర బీజేపీ వివక్ష చూపుతున్నదని, పక్క కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చినట్లు.. తెలంగాణకు మొండిచేయి చూపిస్తున్నదని కేంద్రం పై మంత్రి ఫైర్ అయ్యారు. కేంద్రం బొగ్గుపై సెస్ వేసినట్లు, విద్యుత్ ఉత్పత్తి అయ్యే బొగ్గుపై విపరీతంగా సెస్ పెంచి భారం వేసిందని, ఉచితంగా వచ్చే లోయర్, సీలేరు పవర్ ప్లాంట్ ఆంధ్రకు అప్పగించినట్లు, లోయర్ సీలేరు ఉంటే 10 పైసలకే విద్యుత్ వచ్చేదని, బీజేపీ రాగానే లాక్కుందని.. ఇలా అన్నీ రంగాల్లో తెలంగాణను వివక్ష చూపుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement