Monday, April 29, 2024

రెండోరోజు భారీ వర్షం..పరేషాన్‌ లో రైతులు..

దేవరకద్ర : రైతులని వర్షం వదలటం లేదు. వరి ధాన్యం అంతా కూడా నేల పాలు కావడంతో రైతులు పరేషాన్‌లో పడ్డారు. దేవరకద్ర మండలంలో కురిసిన అకాల వర్షానికి మళ్లీ రెండో రోజు కూడా వరిధాన్యం నీటి పాలయింది. దీనితో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీసుకుని వచ్చి పంట పండిస్తే చేతికి వచ్చే సమయంలో వరుణుడు ప్రతాపం వల్ల వరి ధాన్యం చిందరవందర అవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వరి పంటలు పూర్తిగా నేలకొరిగాయి. గత సంవత్సరం కూడా వరిధాన్యం చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలకు పంటలు నేలపాలు అయ్యాయని రైతులు వాపోయారు. మళ్లీ ఇప్పుడు కూడా సరైన సమయంలో పంటలు చేతికొచ్చే సమయానికి వరుణుడుప్రతాపం చూపడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ప్రభుత్వం కూడా త్వరగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని రైతులు అంటున్నారు. ఇంకా వర్షాలు నాలుగు రోజులు ఉన్నాయని తెలియగానే రైతులు ఇప్పుడే నానా హైరానా పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement