Tuesday, May 21, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 161 పోలింగ్‌ కేంద్రాలు


మహబూబ్‌నగర్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 161 పోలింగ్‌ కేంద్రాల్లో ఎమ్మెల్సి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సి ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తూ ఎన్నికల ఏర్పాట్లు , సామగ్రిని పకడ్బందీగా ఎన్నికల కేంద్రాలకు చేర్చడంలో నిమగ్నమయ్యారు. మున్సిపాలిటీలు అన్ని మండల కేంద్రాలను ఇప్పటికే ఎన్నికల అధికారులు , సిబ్బంది జంబో బ్యాలెట్‌ బాక్సులతో పాటుగా ఎన్నికల సామగ్రిని చేరవేశారు. జిల్లా ఎస్పిల ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళి లో భాగంగా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్‌ అమలులో ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎమ్మెల్సి ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ప్రతి రెండు గంటలకు ఒక సారి ఎన్నికల సరళి రిపోర్టును సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. పాలమూరు జిల్లా వ్యాప్తంగా 18 పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైన కేంద్రాలుగా గుర్తించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు . 144వ సెక్షన్‌ అమల్లో ఉండటంతో ఓటర్లు తప్ప ఇతరులు ఎవరూ గుంపులుగా ఉండకూడదు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్లలోపు ఎలాంటి ప్రచారం కూడా జరగకూడదనే నిబంధన ఉంది. ప్రిసైడింగ్‌ అధికారులు డైరీ రాయడం తప్పనిసరి పాటించాలని , ఎప్పటికప్పుడు బ్యాలెట్‌ పేపర్‌ అకౌంట్‌ చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు సూచించారు. బ్యాలెట్‌ బాక్సుల సంబంధించిన రెండు తాళం చెవిలు ఒక కవర్‌లో , ఒక తాళం చెవి ఉన్న కవర్‌ను ఎమ్మెల్సి ఎన్నికల అధికారికి అప్పగించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు పోలిస్‌ అధికారులు సెక్టోరల్‌ జోనల్‌ అధికారులతో రూట్ల వారిగా ఎన్నికల సరళిని పరిశీలించనున్నారు. మొత్తం మీద ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఎమ్మెల్సి ఎన్నికల ఓటింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు ఒకసారి , 12 గంటలకు , 2 గంటలకు , చివరికి ఎన్నికల పోలింగ్‌ శాతంపై ఉన్నతాధికారులకు ఎన్నికల అధికారులు రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నియమించిన ఎన్నికల అధికారులు , సిబ్బంది పూర్తి ఎన్నికల సామగ్రితో నియమిత పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement