Tuesday, April 30, 2024

L&T: దిగి వచ్చిన ఎల్ అండ్ టీ…. మేడిగడ్డ బ్యారేజీ వద్ద మరమ్మత్తు పనులు ప్రారంభం

కాళేశ్వ‌రం – ఇటీవ‌ల కుంగిన మేడిగడ్డ బ్యారేజీ కు మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవడంతో బ్యారేజీని నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ ఈ పనులను మొదలుపెట్టింది. మొదటి దశలో రూ.55 కోట్ల విలువైన కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభించింది.

గత రెండ్రోజులుగా భారీ నిర్మాణ యంత్రాల సహాయంతో మహారాష్ట్ర వైపు గోదావరి ఒడ్డున ఉన్న మట్టి, రాళ్లు అడ్డుగా పొస్తోందని సమాచారం. పనులకు ఆటంకం కలగకుండా నీళ్లు ఆపేందుకు 7, 8వ బ్లాక్‌ల చుట్టూ ఈ కాఫర్ డ్యామ్‌ను నిర్మిస్తోంది. . కాప‌ర్ డ్యాం పూర్తి అయిన త‌ర్వాత కుంగిన 7, 8 బ్లాక్ ల‌లోని పిల్ల‌ర్స్ ను ప‌రిశీలిస్తారు. కుంగుబాటుకు కార‌ణాలను విశ్లేషిస్తారు. పిల్ల‌ర్ వ‌ద్ద తీసిన పునాదిలో ఇసుక పొర‌లు క‌ద‌ల‌డం వ‌ల్లే బ్రిడ్జి కుంగింద‌ని భావిస్తున్నారు.

అదే నిజ‌మైతే మ‌ళ్ళీ ఆ పిల్ల‌ర్ల‌ను నిర్మించాల్సి ఉంటుంది.. అందుకు ఎల్ అండ్ టి కూడా సిద్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లా‌క్‌లోని పిల్లర్లు ‌‌‌‌ఈ ఏడాది అక్టోబర్‌లో కుంగుబాటుకు గురయ్యాయి. ‘డిఫెక్ట్‌‌‌‌ లయబిలిటీ పీరియడ్‌‌‌‌’ 2022 జూన్‌‌‌‌ 29నే ముగిసిపోవడంతో మరమ్మత్తు పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఎల్ అండ్ టీ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరింది. అయితే అంతకుముందు మరమ్మత్తు పనులు తామే చేస్తామని ప్రకటించి మళ్లీ మాట మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ రిపేర్ పనులు మొదలుపెట్టడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement