Sunday, May 19, 2024

నేడు కెటిఆర్ ఢిల్లీ ప‌య‌నం – అమిత్ షా, రాజ్ నాథ్ ల‌తో భేటి?..

హైద‌రాబాద్ – బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. రెండ్రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేసి పలువురు మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా కేటీఆర్ భేటీ కానున్నారు.. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మ‌ద్య మాట‌ల యుద్ధం జోరుగా సాగుతున్న‌ది.. ఈ నేప‌థ్యంలో బిజెపి కీల‌క‌నేత అమిత్ షాతో కెటిఆర్ భేటీ కానుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు చెబుతున్నా కేటీఆర్, అమిత్ షా భేటీలో ఇతర రాజకీయ వ్యవహారాలూ చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు స‌మాచారం . రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్థి కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాల విషయంలో మరోసారి మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని బీఆర్ ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హోంశాఖ పరిధిలో ఉన్న రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్థి కార్యక్రమాల భూముల గురించి కేటీఆర్‌ అమిత్‌ షాతో మాట్లాడుతారని స‌మాచారం . న‌గరంలో తలపెట్టిన స్కై వేల నిర్మాణం కోసం రక్షణశాఖ నుంచి అడుగుతున్న కంటోన్మెంట్‌ భూముల వ్యవహారం గురించి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ కానున్నారు. వరంగల్‌ మామునూరు ఎయిర్‌ పోర్ట్‌ కు సంబంధించిన అంశం, మెట్రో విస్తరణకు సంబంధించి ఆయా శాఖల కేంద్ర మంత్రులతో కేటీఆర్‌ సమావేశం అవనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌ట‌న‌లో ఉండే కెటిఆర్ తెలంగాణ‌లోని వివిధ ప్రాజెక్ట్ ల విష‌యాల‌పై చ‌ర్చించేందుకు కూడా ఆయా మంత్రుల‌తో సమావేశం కానున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement