Saturday, May 11, 2024

గోళ్లపాడు చానెల్ ఆధునీకరణతో త్రీ టౌన్ కు మహర్దశ: మంత్రి పువ్వాడ

ఖమ్మం (ప్ర‌భ న్యూస్‌) : ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ జూబిలీపురలో గోళ్ళపాడు ఛానల్ పై ఎర్పాటు చేసిన మొహమ్మద్ రజబ్ అలీ పార్క్, రూ.1.86కోట్లతో ఎర్పాటు చేసిన వీధి వ్యాపారుల సముదాయంను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో సుదీర్ఘకాలంగా మురుగుతో పేరుకుపోయిన గోళ్లపాడ్‌ ఛానల్‌ కాలువలో మురుగు నామ రూపాల్లేకుండా చేసి సుమారు రూ.200 కోట్ల విలువైన స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ , పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సహకారంతో కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించి, అంతర్భాగంలో మురుగు, వర్షపు నీరు పారడానికి పైపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నో సంవత్పరాల నుంచి 10.6 కిలోమీటర్లు పొడవునా ఉన్న కాలువ ఆక్రమణలు, సిల్ట్‌తో కుచించిపోయిందని అలాంటి కాలువను పూర్తిగా మార్చగలిగామన్నారు. కాలువపైభాగాన దాదాపు పది పార్కులు, క్రీడాప్రాంగణాలు, బస్తీదవాఖానలు, పట్టణ ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడాప్రాంగణాలు, వాకింగ్‌ ట్రాక్‌లు సుందరంగా ప్రజల సౌకర్యార్థం నిర్మించామన్నారు.

ఈ కాలువ పొడవునా సుమారు 32 ఎకరాల స్థలాన్ని సృష్టించామని, నగరాల్లో ఇంత పెద్దమొత్తంలో స్థలం అందుబాటులో ఉందని, విజన్‌ ఉన్న నాయకుడు కేసీఆర్‌ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే రూ.200 కోట్లకు పైగా ఆస్తి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇక్కడి నుంచి తరలించినవారికి వెలుగుమట్ల వద్ద స్థలాలు ఇచ్చామని ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరగడంతో వారంతా లక్షాదికారులు అయి సంతోషంగా ఉన్నారన్నారు.
ఛానల్ పై అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మించి నగరంలో దాదాపు 23 డివిజన్లకు సంబంధించిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పూర్తి చేసి పై భాగంలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే సుందరమైన పార్కులు, ఆరోగ్యాన్ని పంచే ఓపెన్ జిమ్ లు, ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాలు ఎర్పాటు చేయడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement