Friday, May 10, 2024

రైత‌న్న‌కు కెసిఆర్ అండ – త‌డిసిన ధాన్యం మొత్తం కొంటామని భరోసా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఊహించని విధంగా అకాల వర్షాలు వ్యవసాయ రంగాన్ని వెంటాడుతున్న నేపథ్యంలో ఏ ఒక్క రైతూ అధైర్య పడవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా తెలంగాణాను దేశం కీర్తిస్తున్న తరుణంలో ప్రభుత్వంపై పూర్తి నమ్మకముంచి ముందుకు పోవాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో జరిగిన, జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు అనేక కోణాల్లో ప్రయ త్నిస్తున్నామని తెలిపారు. పంట నష్టానికి పరిహారం చెల్లిండంతోపాటు రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకూ ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇది మీ ప్రభుత్వమన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. గత వారం రోజులుగా పంట కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానల నేపథ్యంలో తడిసిన ధాన్యం కొనుగోళ్ళు, అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, జరిగిన నష్టం, జిల్లాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళు జరుగుతున్న తీరు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరిధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా చర్యలు, ఇందుకు వ్యవసాయ శాఖ అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తామని రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చారు. మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని కాపాడుతూ, రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. గతానికి భిన్నంగా అకాల వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే జరిగే విధంగా ఎటు-వంటి విధానాలను అవలంబించాలో అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖకు మార్గనిర్ధేశం చేశారు.

వరి కోతలను కొద్ది రోజులు వాయిదా వేయండి..
అకాల వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరికోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని రైతులకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రైతాంగానికి సూచించారు. వ్యవసాయ అభివృద్ధికి, రైతు కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా ఊహించని విధంగా సత్ఫలితాలను అందిస్తున్నదని పేర్కొన్నారు. ఇక్కడి విధానాలు, ప్రోత్సాహకాలతో పొరుగు రాష్ట్రాలను అధిగమిస్తూ తెలంగాణ రైతులు వరి ధాన్యాన్ని పండిస్తున్నారని, అదే సందర్భంలో ఎంత పండిస్తే అంత పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ‘ఎన్ని కష్టాలను భరించైనా సరే రైతుల కల్లాల కాడికే పోయి సేకరిస్తున్నది. ఇట్లా రైతుల కోసం చిత్తశుద్ధితో దృఢసంకల్పంతో కార్యాచరణ అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇటు-వంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా అకాలంగా కురుస్తున్న వడగండ్ల వానలు ఎడతెరిపిలేకుండా కొనసాగుతుండడం బాధాకరం’ అని సీఎం వ్యాఖ్యానించారు.
రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తున్నాం..

ప్రకృతి వైపరీత్యానికి ఎవరం ఏమీ చేయలేమని, అయినా అదే సమయంలో సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ”వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలుఅందిస్తూ ఇప్పటికే ఆదుకుంటు-న్నది. ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది” అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆపత్కాలంలో రైతుల దు:ఖాన్ని, కష్టాన్ని పంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైందని సీఎం తెలిపారు. వీలైనంత త్వరగా ఒక్క గింజ కూడా వృధా పోకుండా ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రైతన్నలు ఏమాత్రం ఆందోళన చెందవద్దని, ఆ దిశగా అధికార యంత్రాంగం వారికి ధైర్యం అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొనసాగుతున్న యాసంగి వరిధాన్యం సేకరణ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదని, కొన్ని చోట్ల అకాల వర్షాలు కురుస్తుండడంతో సేకరణకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని అధికారులు వివరించారు. అయినా త్వరలోనే ధాన్య సేకరణ పూర్తి చేయనున్నట్టు- పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. కాగా.. మరో మూడు నాలుగు రోజులపాటు- వానలు కొనసాగనున్నాయని అధికారులందించిన వివరాల మేరకు అప్పటిదాకా వరిపంటను కోయకుండా సంయమనం పాటించడం మంచిదని, తద్వారా ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని రైతులకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సూచించారు.

ఈ పరిస్థితులు గుణపాఠంగా భవిష్యత్తు కార్యాచరణ
కురుస్తున్న ఈ అకాల వానలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో నష్టాలు జరగకుండా ముందస్తు అవగాహనను ఏర్పరుచుకోవాలని అటు- వ్యవసాయ శాఖకు, ఇటు- రైతాంగానికి సీఎం కేసీఆర్‌ సూచించారు. అందులో భాగంగా…. ప్రతి ఏటా మార్చినెలాఖరుకల్లా యాసంగి వరికోతలు పూర్తయ్యేలా రాష్ట్ర రైతాంగం వరిని ముందస్తుగానే నాటు-కోవాలని సీఎం పిలుపునిచ్చారు. మార్చి నెల తర్వాత అకాల వానలు పడే అవకాశాలు ఉన్నందున ఆ లోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదన్నారు. ఏప్రిల్‌, మే నెలలు వచ్చేదాకా వరిపంట నూర్పకుంటే ఎండలు ఎక్కువై ధాన్యంలో నూకశాతం పెరిగిపోతుందన్నారు. అటు- అకాల వానల నుంచి తప్పించుకోవటం ఇటు- నూకలు కాకుండా వుండాలంటే మార్చి నెలాఖరుకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కోతకొచ్చేలా ముందస్తుగానే నాట్లు- వేసుకోవాలని రైతాంగానికి సీఎం సూచించారు. ఈ దిశగా మరింత శాస్త్రీయ అధ్యయనం చేసి రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యపరచాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఫర్టిలైజర్స్‌ వాడే విషయంలో కూడా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

రైతులను చైతన్యపరిచేందుకు గ్రామాల్లో ప్రచారం
ప్రకృతి వైపరీత్యాలు తదితర సందర్భాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులను ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, అడ్వర్‌-టైజ్‌మెంట్లు- తదితర ప్రచార మార్గాల ద్వారా అవగాహనను, చైతన్యాన్ని కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖలోని కిందిస్థాయి ఏఈవోలను, అధికారులను ఎప్పటికప్పుడు ఈ దిశగా అప్రమత్తం చేయాలని, వారు నిరంతరం రైతులకు అందుబాటు-లో వుంటూ ఎప్పటికప్పుడు తగు సూచనలందించాలని, ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావును సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మించిన రైతు వేదికలను వేదికగా చేసుకుని వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ దిశగా పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండండి: సీఎం ఆదేశం
”తెలంగాణ వ్యవసాయం అత్యంత వేగంగా పురోగతిని సాధిస్తున్నది. ఈ స్పీడును అందుకునే దిశగా వ్యవసాయ శాఖ నిత్యం అప్రమత్తంగా వుండాలె. ఏ మాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలుంటాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ అవుతూ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలను, లక్ష్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ మరింత డైనమిక్‌గా పనిచేయాల్సిన అవసరం వ్యవసాయ శాఖకు ఉన్నది” అని సీఎం స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి; ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, బాజిరెడ్డి గోవర్దన్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌ రావు, ఫైనాన్స్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సబర్వాల్‌, రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement