Wednesday, April 24, 2024

జూబ్లీ హిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసు.. అత‌డు మేజ‌ర్ కాదు మైన‌రే – హైకోర్టు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్‌లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరో నిందితుడిగా ఉన్న మైనర్ బాలుడిని మేజర్‌గా పరిగణించాలంటూ గతంలో పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది.
మైనర్‌గానే పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
వివ‌రాల‌లోకి వెళితే 10 నెలల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఆమ్నేషియా పబ్‌లో సామూహిక అత్యాచారం ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లు నిందితులుగా ఉన్నారు. ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగానే పరిగణించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారు. తీవ్రమైన కేసులో మైనర్లను మేజర్లుగా పరిగణించాలని కోరారు.


ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆరో నిందితుడిగా ఉన్న మైనర్‌ హైకోర్టుకు వెళ్లాడు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పోక్సో కోర్టు తీర్పును కొట్టేసింది. దీంతో ఈ కేసులో ఇప్పుడు నలుగురు మేజర్లు, ఇద్దరు మైనర్లు నిందితులుగా ఉన్నట్లయింది. ప్ర‌స్తుతం ఈ కేసు ఇంకా విచార‌ణ ద‌శ‌లోనే ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement