Saturday, July 27, 2024

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించండి: కలెక్టర్ ఆదేశం

వరిధాన్యం కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వానకాలంలో పండించిన  వరిధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. జిల్లాలో వానకాలంలో ఒక లక్షా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పిఎసిఎస్, డిఆర్డిఎ, జిసిసిల ద్వారా 160 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులు చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు అనేది ప్రస్తుతం చాలా సున్నితమైన అంశమన్నారు. జిల్లాలో పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆరోపణలు రాకుండా రైతుల నుండి సమయానికి కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే వరిధాన్యం కోతకు వచ్చినందున ఆయా ప్రాంతాల్లో వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుండి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ముందస్తుగా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ లను సిద్ధం చేయలన్నారు. తేమ శాతంను కొలిచే మిషన్ లను కూడా ముందుగానే చెక్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలన్న కలెక్టర్.. కొనుగోలు కేంద్రాలలో సరిపడినంతగా టార్పాలిన్లు, గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే, కూలీల సమస్య కాకుండా చూడాలని చెప్పారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement