Thursday, May 2, 2024

TS: కేసీఆర్ కారును గ్యారేజీకి పంపే సమయం వచ్చింది.. అమిత్ షా

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, నవంబర్ 27 (ప్రభన్యూస్) : తెలంగాణలో రాష్ట్రంలో కేసీఆర్ కారును గ్యారేజీకి పంపించే సమయం ఆసన్నమైందని, కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసినట్లేనని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఆధాయ పన్నును రద్దు చేస్తామని, ఒక్క రూపాయి కూడా చెల్లించే అవసరం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై 2014, 2018లో గెలిచిన ఎమ్మెల్యేలంతా కేసీఆర్ కు అమ్ముడు పోయారని, కాంగ్రెస్ ను గెలిపిస్తే మళ్లీ అమ్ముడు పోతారని అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని వారు ఊహించుకుంటున్నారని, కేసీఆర్ సర్కార్ వచ్చేది లేదు, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదని, మూడవ సారి కూడా మోడీ ప్రధానమంత్రి అవుతాడన్నారు.

ఓవైసీకి భయపడి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని, బీజేపికి ఓటు వేసి గెలిపిస్తే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని, కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు ఓవైసీకి భయపడుతాయని, భారతీయ జనతా పార్టీ భయపడదని, మతపరంగా ముస్లింలకు ఇచ్చిన 4శాతం రిజర్వేషన్ ను రద్దు చేసి బీసీలకు కేటాయిస్తామని, మాదిగ సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీని నెరవేరువస్తామని, అదేవిధంగా బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ రావును కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని, వచ్చే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్ షోలో బీజేపీ మంచిర్యాల నియోజకవర్గ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ రావు, పలువురు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement