Thursday, April 25, 2024

TS: కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు… బోయినపల్లి వినోద్ కుమార్

ఇల్లంతకుంట (ప్రభ న్యూస్) : ప్రస్తుతం నెలకొన్న కరువు కాలం తెచ్చింది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని కరీంనగర్ టీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో ఎండిన పంటపొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… రైతు ప్రభుత్వమని చెప్పి రైతులను ఆగం చేస్తుందన్నారు. ఎండిపోయిన పంటలకు రైతులకు ఎకరాకు 25వేల రూపాయల పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులను మోసగించిన కాంగ్రెస్ కు పుట్టగతులుండవని, రైతులు అన్నమో రామచంద్ర అంటున్నా ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు.

రైతులు సచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో రోజుకు 5000ల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్న కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మూడు పిల్లర్లు కుంగితే దానిని సాకుగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెట్టి, సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీరు పెట్టిస్తోందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 180మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు. రైతుభరోసా పథకం ద్వారా రైతులకు ఎకరాకు రూ.15000ల సాయం, రూ.2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, జడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ బిల్లవేని పర్శరాం, మాజీ ఏఎంసీ చైర్మన్ వేణురావు, అనంతగిరి ఎంపీటీసీ పర్శరాం, గుండ ముత్తయ్య, కెవిఎన్ రెడ్డి, గాదె కనకయ్య, బిల్లవేని చంద్రయ్య, కొమ్ము కనకయ్య, ఏనుగుల పర్శరాం, ఏనుగుల బుచ్చిరెడ్డి, కూస నరేష్, బిల్లవేని సాయి, ఆరే కొమురయ్య, జక్కుల నాగరాజు యాదవ్, దూలం సంపత్ గౌడ్, సంతోష్ రెడ్డి, ఆళ్వాల రాజేశం, రమేశ్, ఓంకార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement