Monday, May 6, 2024

ప్రభుత్వం అప్రమత్తంగా లేక‌పోతే పెను ప్రమాదమే.. వ‌ర‌ద‌ల‌పై త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలి: రేవంత్‌రెడ్డి

ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైందని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అప్రమత్తగా వ్యవహారించకపోతే పెను విపత్తు జరిగే ప్రమాదం ఉందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. వర్షాల వల్ల కలిగే ఇబ్బందులు, నష్టాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా కడెం ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారని, సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందించిన సంబంధిత శాఖలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.

కడెం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. క్షేత్ర స్థాయిలో 17 పార్లమెంట్‌ నియోజక వర్గాలకు గాను 17 మంది మంత్రులను కేటాయించాలని, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు సాగు, తాగునీటి శాఖలు, వైద్య, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఏ ప్రమాదం జరిగినా, చిన్నపాటి నష్టం వాటిల్లినా దానికి సీఎం కేసీఆరే స్వయంగా బాధ్యత వహించాలని రేవంత్‌రెడ్డి అన్నారు.

సగం నెలవతున్నా జీతాలేవీ..?
ఉద్యోగులకు జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. సగం నెల కావస్తున్నా సగానికి పైగా జిల్లాల ఉద్యోగులకు జీతాలివ్వలేదని ఆయన ఆరోపించారు. ‘ జీతమో రామ చంద్ర అంటున్నారు ఉద్యోగులు. సగం నెల కావస్తున్నా సగానికి పైగా జిల్లాల ఉద్యోగులకు జీతాల్లేవ్‌. వంతల వారిగా జీతాలివ్వడం చరిత్రలో ఎన్నడు లేదు ‘ అని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ దివాలా తీయించాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలని ఆయన ప్రశ్నించారు.

ప్రశ్నించకపోతే రాష్ట్రం అజ్ఞానాంధకారమే..?
రాష్ట్రంలో పేద పిల్లల చదువులకు ‘ చంద్ర ‘ గ్రహణం పట్టిందని టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మరో ట్వీట్‌ చేశారు. ఉపాధ్యాయులు, పాఠ్య పుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయని ఆయన విమర్శించారు. ‘ మన ఊరు- మన బడి కార్యక్రమం ‘ ఓ ప్రచార ఆర్భాటం తప్ప విద్యార్థులకు ఒరిగిందేమి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement