Monday, April 29, 2024

NZB: అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలి.. కలెక్టర్

నిజామాబాద్ సిటీ, ఆగస్టు 30 (ప్రభ న్యూస్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల పురోగతి పై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో చార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు.

పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. పోలీస్ శాఖ ద్వారా అందించాల్సిన నివేదికలను సత్వరమే పంపించాలని, తద్వారా పెండింగ్ లో ఉన్న బాధితులకు కూడా ఎక్స్ గ్రేషియా అందించే ఏర్పాటు చేస్తామని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులకు సూచించారు. పెండింగ్ ట్రయల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, అట్రాసిటీ కేసుల్లో నిందితులు తప్పించుకోకుండా వారికి తగిన శిక్షపడేలా పూర్తి ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, జిల్లా సాంఘీక సంక్షేమ అభివృద్ధి అధికారిణి శశికళ, ఏసీపీ కిరణ్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీటీడబ్ల్యుఓ నాగూరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రషీద్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు, విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement