Monday, July 22, 2024

TS: ఆదిలాబాద్ లో ఆగని విత్తనాల లొల్లి..

పత్తి విత్తనాలు తరలిస్తుండగా అడ్డుకున్న రైతులు..
గంటసేపు రాస్తారోకో.. స్తంభించిన రాకపోకలు

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్: డిమాండ్ ఉన్న పత్తి విత్తనాల కోసం గత మూడు రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. మార్కెట్లో రాసి 659 పత్తి విత్తనాల కొరత కారణంగా ప్రతిరోజు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తుంటే.. ఈరోజు పంజాబ్ చౌరస్తాలోని నిఖిల్ ట్రేడర్స్ విత్తనాల దుకాణం నుండి వాహనంలో 160 రాసి విత్తనాలను ఇచ్చోడ కేంద్రానికి తరలిస్తుండగా రైతులు పట్టుకొని అడ్డుకున్నారు.

రోజంతా లైన్లో నిల్చుంటే.. రెండు పత్తి విత్తన బ్యాగులు కూడా దొరకడం లేదని, ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు డీలర్ ను నిలదీసి రైతులంతా పంజాబ్ చౌరస్తా రహదారిపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. హోల్ సేల్ దుకాణం నుండి ఇచ్చోడ రిటైల్ డీలర్ కు వే బిల్లుతో సహా రాసి రకం150 పత్తి విత్తనాల ప్యాకెట్లు పంపుతున్నట్టు డీలర్ పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు దొంగ చాటున విత్తనాలు అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని నిలదీశారు.

ప్రైవేట్ డీలర్ పై కేసు నమోదు..
నిఖిల్ ట్రేడర్స్ నుండి పత్తి విత్తనాలు తరలింపు వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతున్నామని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిజంగానే బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొనడంతో రైతులు శాంతించారు. విత్తనాల కొరత, డీలర్ల ఆగడాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని వ్యవసాయ అధికారి పుల్లయ్య హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement