Monday, April 29, 2024

TS: నేను లోకల్.. సీఎం, ఆయన అభ్యర్థి నాన్ లోకల్.. డీకే అరుణ

మక్తల్, మార్చి30 (ప్రభ న్యూస్) : లోక్ స‌భ‌ ఎన్నికల్లో మహబూబ్ న‌గ‌ర్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పాలమూరు బిడ్డగా మీ ముందుకు వచ్చా ఆశీర్వదించండి.. అభివృద్ధి పరిచయం చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. పాలమూరు బిడ్డగా పదవులున్నా.. లేకపోయినా.. పాలమూరు ప్రజలతోనే ఉన్నా.. ప్రజల కష్టసుఖాల్లో, అభివృద్ధిలోనూ నేనున్నా.. దేశం కోసం మోడీ.. పాలమూరు కోసం అరుణమ్మ అనే నినాదాన్ని కార్యకర్తలంతా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇవాళ మాగనూర్, ఊట్కూర్ మండల కేంద్రాల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. మరోసారి ప్రధాని కాబోయేది మోడీనే, అందులో నో డౌట్, బూత్ స్థాయికి కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ పథ‌కాల ఫలాలు అందుతున్న ప్రతి ఇంటికి వెళ్లాలి.. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారని, ప్రతి ఎన్నికల్లో డ్రామాలు చేయడంలో, మందిని మోసం చేయడంలో ఆయన దిట్ట అని ధ్వజమెత్తారు. అయన లోకల్ కాదు.. ఆయన అభ్యర్థి లోకల్ కాదు ఇక్కడొచ్చి డ్రామాలు ఆడితే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. స్థానిక సమస్యలు తనకు పూర్తిగా తెలుసని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని డీకే అరుణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, మాగనూరు ఎంపీపీ శ్యామలమ్మ, బీజేపీ నాయకులు ఎం.భాస్కర్, కె.సోమశేఖర్ గౌడ్, కర్ని స్వామి, నారాయణ, శ్రీనివాసులు, బలరాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement