Saturday, April 27, 2024

క‌రోనా పోరులో సాంకేతిక‌త అత్యంత కీల‌కం – కెటిఆర్

హైదరాబాద్‌, : కొత్తతరం సాంకేతికతను వాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుస లో ఉందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ముఖ్యంగా భూ సంస్కరణలు, ఇతర పాలనా సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేసి ముందుకు పోతున్నామన్నారు. సమాజ క్షేమానికి దోహద పడని సాంకేతిక పరిజ్ఞానం వృథా అని సీఎం కేసీఆర్‌ ఆలోచనా విధానం మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పౌర సేవలు, సమాజ హితానికి ఎలా వాడుకోవాలో ఎప్పటి కప్పుడు సమీక్షించుకుని ముందుకుపోతున్నామని తెలిపా రు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (జపాన్‌) నిర్వహించిన గ్లోబల్‌ టెక్నాలజీ గవర్నమెంట్‌ సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. జపాన్‌ నుంచి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించిన ఈ సమావేశంలో రువాండాకు చెందిన ఐటీశాఖ మంత్రి పౌల ఇనగంబిరే, ప్రపంచంలోని 45 ప్రముఖ వైద్య, సాంకేతిక, టెక్నాలజీ కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సేవింగ్‌ లైఫ్‌ విత్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనే అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు. కొత్త తరం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవల పరిధిని విస్తరించే అవకాశాలను తెలంగాణ ఉపయోగించుకోనుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూరప్‌ లాంటి దేశాలతో పాటు ప్రపంచంలోని ప్రతి దేశంలో వైద్య రంగానికి సంబంధించిన సరిపడా మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటున్న విషయాన్ని ఎత్తి చూపింది అన్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు సహకార పూరిత ధోరణితో ఈ సంక్షోభానికి అంతం పలికేందుకు గత ఏడాది కాలంగా నిరంతరం శ్రమిస్తున్నాయని అన్నారు. కరోనా లాంటి మహమ్మారిపైన సాగించే పోరులో ఎమర్జింగ్‌ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకంగా మారిందన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభంలో టెక్నాలజీని ఉపయోగించుకుని కరోనా కట్టడి, వైద్య విద్య సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు అందించడంలో ముందు వరుసలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. అయితే ఈ రంగాల్లో టెక్నాలజీల వినియోగం ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉందని, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, వర్చువల్‌ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక రెట్లు ప్రజలకు ప్రయోజనాలు కల్పించే వీలు కలుగుతుందన్నారు. ఇప్పటికే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంతో కలిసి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రోన్ల సాంకేతికత వినియోగానికి సంబంధించి ఒక పైలట్‌ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా లాంటి మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రపంచంలోని ప్రతి మానవుని హెల్త్‌ ప్రొఫైల్‌ డిజిటలైజ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement