Monday, April 29, 2024

Crime : భార్యను హ‌త‌మార్చాడు.. కనిపించట్లేదని డ్రామాలాడ‌డు.. పోలీసుల‌కు చిక్కాడు

భార్య‌ను చంపి క‌న‌బ‌డ‌డం లేద‌ని డ్రామాలు ఆడిన భ‌ర్త చివ‌రికి పోలీసుల‌కు చిక్కాడు. ఈ ఘ‌ట‌న మియాపూర్‌లో చోటుచేసుకుంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న మియాపూర్‌ పోలీసులు భర్తను రిమాండ్‌కు తరలించారు.

మియాపూర్‌ సీఐ ప్రేమ్‌ కుమార్‌, ఎస్సై గిరీష్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన రాజేశ్వరి (38)కి అదే జిల్లా రుద్రురు మండల కేంద్రానికి చెందిన కార్పెంటర్‌ రాజేష్‌తో 2005లో వివాహమైంది. రాజేష్‌ బతుకుదెరువుకు హైదరాబాద్ వచ్చి.. మియాపూర్‌లో ఉంటున్నాడు. రాజేష్‌, రాజేశ్వరిలకు ఇద్దరు కుమారులు. పిల్లలు బోధన్‌లో రాజేశ్వరి తల్లి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. 18 ఏళ్ల వైవాహిక జీవితం సాఫీగానే సాగినా.. భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా రాజేశ్వరి అడ్డు తొలగించుకోవాలని డిసెంబర్ 10న గండిమైసమ్మ ప్రాంతంలో ఓ ఫంక్షన్‌ ఉందని రాజేష్‌ బైకుపై తీసుకెళ్లాడు.
బౌరంపేట సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు సర్వీస్‌ ప్రాంతానికి రాజేశ్వరిని తీసుకెళ్లి.. తలపై రాయితో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని సర్వీస్‌ రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడేసి.. మియాపూర్‌లోని ఇంటికి వచ్చాడు. 12న రాజేశ్వరి తల్లి, సోదరికి ఫోన్‌ చేసి.. తన భార్య కనిపించడం లేదని రాజేష్‌ నాటకం మొదలుపెట్టాడు. కంగారుపడిపోయిన రాజేశ్వరి తల్లి.. డిసెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో.. అసలు విషయం వెలుగు చూసింది. రాజేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. రాజేష్‌ను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement