Friday, May 3, 2024

జిహెచ్ఎంసి కార్యాలయంలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికను పూలమాలతో అలంకరించి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు, పేరొందిన రాజకీయ నాయకుడు, నిమ్నజాతి సంక్షేమం అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తిగా పేరుగాంచారన్నారు. భారత పార్లమెంట్ లో సుదీర్ఘ 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు పొంది దేశానికి సేవ చేయడం జరిగిందని, భారత ఉప ప్రధానిగా బంగ్లా దేశ యుద్ద సమయంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసి ఇండియా విజయానికి తనవంతు పాత్ర పోషించారని కమిషనర్ వారి సేవలను కొనియాడారు. బాబూగా ఆప్యాయంగా పిలువబడే బాబూ జగ్జీజీవన్ రామ్ 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం ఆల్ ఇండియా డిప్రెస్ట్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించారన్నారు. అందరూ ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ముందుకు రావాలని కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… నిమ్న వర్గాల నుండి ఉన్నత స్థానానికి ఎదిగి ఆదర్శ ప్రాయులుగా నిలిచారన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఎంతగానో కృషి చేశారని డిప్యూటీ మేయర్ అన్నారు. వారి ఆశయాలను ఆచరణలోకి తీసుకొని వచ్చి సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ మేయర్ కోరారు.

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ లు శృతి ఓజా, జయరాజ్ కెనడి, విజయలక్ష్మి, సరోజ, కృష్ణ, ఈ.ఎన్.సి జియాఉద్ధిన్, ఎస్.ఆర్.డి.పి ప్రాజెక్టు సి.ఈ దేవానంద్, సి.సి.పి దేవేందర్ రెడ్డి, హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్ కుమార్, చీఫ్ ఎగ్జామినార్ వెంకటేశ్వర రెడ్డి, కార్యదర్శి లక్ష్మి, సి.పి.ఆర్.ఓ మొహమ్మద్ ముర్తుజా, టి.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి, పి.ఆర్.ఓ లు పద్మ, జీవన్ కుమార్, ఎస్.సి.ఎస్.టి సంఘాల ప్రతినిధులు, తదితరులు బాబూ జగ్జీ జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జోనల్, డి.సి కార్యాలయాల్లో కూడా డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement