Monday, May 6, 2024

యాదవులు, కుర్మల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.. మంత్రి తలసాని

యాదవులు, కుర్మలు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద ఈనెల 26వ తేదీన మన్నెగూడలోని BMR సార్ధ కన్వెన్షన్ లో జరిగే యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనం బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం యాదవ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ… జనాభా పరంగా యాదవ కుర్మలు పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంకు ముందు యాదవ, కుర్మలను కేవలం ఓటు బ్యాంకు లాగానే చూశారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ యాదవులకు రాజకీయంగా పెద్దపీట వేశారని తెలిపారు. అదేవిధంగా ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.11 వేల కోట్ల వ్యయంతో సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గొర్రెల యూనిట్ ల లబ్ధిదారుల ఖాతాల్లోకి పైలెట్ ప్రాజెక్ట్ గా నగదు బదిలీని చేపడితే BJP నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి నిలిపి వేయించారని ఆరోపించారు. దీంతో యాదవ, కుర్మల వ్యతిరేకి BJP అని రుజువైందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో BJP కి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. యాదవులు, కుర్మల ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, కార్పొరేటర్ రసాల వెంకటేష్, యాదవ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్, నల్లగొండ జిల్లా DCMS చైర్మన్ వట్టెపు జానయ్య, నాయకులు పెద్ద బోయిన శ్రీనివాస్, సోమన బోయిన సుధాకర్, కడారి అంజయ్య, ఐలేష్ యాదవ్, రాజారాం, శ్రీహరి, గోసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement