Monday, April 29, 2024

Election Commissioner – నాన్ లోక‌ల్ నేత‌లు వెళ్లిపోండి… టివి, సోష‌ల్ మీడియాల‌లో ప్ర‌క‌ట‌న‌లు ఆపండి…

హైద‌రాబాద్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నేటి సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. ప్ర‌చార ఘ‌ట్టం ముగిసిన అనంతరం మీడియాతో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 13 నియోజకవర్గాల పరిధిలో నాలుగు గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెంట్ పీరియడ్ ప్రారంభమైందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ప్రచార గడువు ముగియడంతో సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని తెలిపారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశముందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని పేర్కొన్నారు. ఇక పోలింగ్ రోజున అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌ల‌కు సెల‌వు ఇవ్వాల‌ని ఆదేశించారు..

”టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదు. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధం. ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయట కూడా వెబ్‌ కాస్టింగ్‌. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పోలింగ్‌ కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిషేధం. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.737 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం” అని వికాస్‌రాజ్‌ వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 19,375 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాజ్ రాజ్ చెప్పారు. బుధవారం సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారం నిలిపేయాలని స్పష్టం చేశారు. రేపు ఎన్నికల సిబ్బంది సామగ్రి పంపిణి చేస్తాం అని వికాస్ రాజ్ చెప్పారు. పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇక వివిధ పార్టీల పోలింగ్ ఏజంట్లు ఉదయం 5.30 గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల‌లో నాన్ లోకల్ లీడ‌ర్స్ అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement