Sunday, April 28, 2024

AUXiLO: 10,000 పాఠశాలలు, విద్యా సంస్థలకు నిధులు సమకూర్చ‌డ‌మే ఆక్సిలో ఫిన్‌సర్వ్ ల‌క్ష్యం

హైద‌రాబాద్ : ఆక్సిలో ఫిన్‌సర్వ్ రాబోయే 5 సంవత్సరాలలో భారతదేశం అంతటా 10,000 పాఠశాలలు, విద్యా సంస్థలకు నిధులు సమకూర్చే ప్రణాళికలను ప్రకటించింది. సామర్థ్య పెంపుదల, ప్రాంగణాల విస్తరణ కోసం భూమి కొనుగోలు, బోధనా సౌకర్యాల ఆధునీకరణ, అధిక ఖర్చుతో కూడిన అప్పుల భర్తీకి సంబంధించిన అవసరాలను తీర్చడానికి విద్యా సంస్థలకు కంపెనీ ఆర్థిక సహాయం చేయనుంది.

ఈసంద‌ర్భంగా ఆక్సిలో ఫిన్ సర్వ్ , ఎండి అండ్ సీఈఓ నీరజ్ సక్సేనా మాట్లాడుతూ… తాము మార్చి 2018లో విద్యా సంస్థలకు నిధులను అందించడం ప్రారంభించామన్నారు. అయితే రాబోయే సంవత్సరాల్లో మహమ్మారి ప్రభావం త‌మ ప్రణాళికలను కాస్త నెమ్మదించేలా చేశాయన్నారు. సాధారణ స్థితికి పరిస్థితులు రావడంతో తాము ఇప్పుడు ఈ విభాగాన్ని దూకుడుగా ముందుకు కొనసాగిస్తున్నామన్నారు.

ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ లోన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీరజ్ శర్మ మాట్లాడుతూ… భారతదేశమంతటా విద్యాసంస్థల రుణ అవసరాలను తీర్చడం త‌మ ప్రణాళిక అన్నారు. తాము ప్రోత్సాహకరమైన స్పందనలను అందుకున్నామన్నారు. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలతో భాగస్వాములం కావటంతో పాటుగా వారి మొత్తం అభివృద్ధిలో భాగమవుతామని ఆశిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దక్షిణ, మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో త‌మ కార్యకలాపాలను విస్తరించిన తర్వాత తాము వచ్చే ఆర్థిక సంవత్సరంలో తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నామని తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement