Friday, May 17, 2024

తెలంగాణలో దూంధాం గా 75వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుకలు….

హైదరాబాద్‌, ”ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌” పేరిట దేశవ్యాప్తంగా జరుపనున్న 75 ఏళ్ళ స్వాతంత్య్ర పండుగ ఉత్సవాలను తెలంగాణలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. నాటి భారత స్వాతంత్య్ర సంగ్రామం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైన దని సిఎం అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా స్వయం పాలనలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, దేశ అభ్యుదయంలో తెలం గాణది ఉజ్వలమైన భాగస్వామ్యమని ముఖ్యమంత్రి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల నేపథ్యం లో భారత ప్రధాని నరేంద్రమోడీ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతను విధి విధానాలను లక్ష్యాలను ప్రధాని వివరించారు. ఆయా రాష్ట్రాలు 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించా లని కోరారు. ప్రధానితో వీడియో కాన్పరెన్స్‌ అనంతరం.. కార్యక్రమ నిర్వహణ విధి విధానాల కోసం, సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉత్సవాల నిర్వహణ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ రాజు, డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ తదిరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఉత్సవాలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
ఉత్సవాల్లో భాగంగా మార్చి 12న హైద్రాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో, వరంగల్‌ పోలీసు గ్రౌండ్స్‌లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్య మంత్రి నిర్ణయించారు. హైద్రాబాద్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్‌., వరంగల్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌లు పాల్గొంటారు. మార్చి 12న ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్‌ మార్చ్‌, గాలిలో బెలూన్లు వదలడం తదితర దేశభక్తి కార్యక్రమాలు ఉంటాయని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాలను కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరుపాలని సీఎం సూచిం చారు.”ఆజాదీ కా అయృత్‌ మహోత్సవాల”ను ఘనంగా, పండుగ వాతావరణంలో ప్రశాంతంగా నిర్వ‌హించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులను అమరవీరులను స్మరించుకుని జోహార్లు అర్పించాలన్నారు.
తెలంగాణలోని 75 ప్రాంతాల్లో..
75వ స్వాతంత్య్రోత్సవ ఉత్సవాలకు గుర్తుగా, సంజీవయ్య పార్క్‌లో వున్న జాతీయ పతాకం తరహాలో, తెలంగాణ వ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో ఘనమైన రీతిలో జాతీయ జెండాలను ఎగురవేయాలని సీఎం తెలిపారు. తద్వారా తెలంగాణ వ్యాప్తంగా జాతీయ భావాలను మరింతగా పెంపొందించాలని పేర్కొన్నారు. 75 వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖన పోటీలు వంటి దేశభక్తిని పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం అన్నారు.
ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కేవి రమణాచారి
మార్చి 12, 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్స వాలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం తెలి పారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి వ్యవహరిస్తారని, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, సాంస్క్రతిక వ్యవహారాల శాఖ, మునిసిపల్‌ శాఖ, పంచాయితీరాజ్‌ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు, డైరక్టర్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, కమీషనర్‌ పంచాయితీరాజ్‌, సభ్య కార్యదర్శిగా సాంస్క్రతిక శాఖ డైరక్టర్‌లు ఉంటారని సీఎం తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి సీఎస్‌ను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement