Friday, May 3, 2024

Big story | గుండె చెరువు, బతుకు బరువు.. భారీ వర్షాలతో ఎటుచూసినా కన్నీటి కష్టాలే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : హృదయ విదారకం.. కన్నీటి పర్యంతం.. ఎటు చూసినా ఆర్తనాదాలే.. వరద పీడిత ప్రాంతాల్లో ప్రజలను దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నాయి. గత పది రోజులుగా కురిసిన అతిభారీ వర్షాలు, ఎగువ నుంచి ఊహించని విధంగా వస్తున్న వరదలతో ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, యేటిగట్లు తెలిపోవడంతో వందలాది గ్రామాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులై చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐదుగురు జల సమాధి కాగా, అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 23 మంది గల్లంతయ్యారు. వారిలో 13మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. అనధికారికంగా అనేకమంది వరదల్లో కొట్టుకుపోయి జాడ తెలియడం లేదు. ఊహించని పంట నష్టం, హృదయ విదారకంగా ప్రాణనష్టం, అంచనాకందని ఆస్తినష్టం సంభవించింది. పొలాలు, వరి నారుమళ్ళలో ఇసుక మేటలు పేరుకుపోయాయి. వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో అన్నదాతల కష్టాలు వర్ణణాతీతంగా కనిపిస్తున్నాయి. వరదల ముప్పుతో వందలాది లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి.

- Advertisement -

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా అతలాకుతలమైంది. వాగులు ఉప్పంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల నిండి మత్తడి వరదలు రహదారులపై ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల్లో చిక్కుకొని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొరంచవాగు ఉప్పొంగలతో మోరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఈ వరదల్లో నలుగురు గల్లంతయ్యారు. ములుగు జిల్లాలో జంపన్నవాగు మహోగ్రరూపం దాల్చింది. కొండాయి, మల్యాల గ్రామాజల దిగ్భందంలో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా వాగు ఊరిపై కమ్మేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టు-కొని పరుగులు పెట్టిన 20 మందిలో ఏడుగురు వరదల్లో గల్లంతయ్యారు.

హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం వద్ద కొండల మహేందర్‌ అనే వ్యక్తి బైక్‌తో సహా వరదల్లో కొట్టుకుపోయి ముళ్ళపొదల్లో అతని మృతదేహం లభ్యమైంది. హనుమకొండ అమృత టాకీస్‌ సమీపంలో జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో ప్రేమ్‌ సాగర్‌ అనేవ్యక్తి మృతి చెందాడు. ఇలా ఒక్కటేమిటి.. వరద పీడిత ప్రాంతాల్లో ఏ గ్రామంలో చూసినా బాదితుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. కుండపోత వర్షాలు, వరదలు వూహించని విధంగా ప్రాణ నష్టం మిగిల్చాయి. మృతుల కుటుంబ సభ్యులు పుట్టెడు దుఖంతో బోరున విలపిస్తున్నారు.

వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బ

మరోవైపు అన్నదాతల గుండె చెరువై, బతుకు భారమైపోయింది. రాష్ట్రంలో ఇంతకాలం అనావృష్టి పరిస్థితితో అల్లాడిన రైతులు.. ప్రస్తుతం అతివృష్టితో కడగండ్ల పాలవుతున్నారు. వరదలతో కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటల వేయడంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టు మిట్టాతుండగా మరికొన్ని ప్రాంతాల్లో వరద ఉద్ధృతితో పైరుకు అపారనష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు- వ్యవసాయ శాఖ అధికారుల అంచనా వేస్త్తున్నారు. రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో పలు జిల్లాల్లో అన్నదాతలకి కంటిమీద కునుకులేకుండా పోయింది. దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురికావడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటు-న్నారు. పొలాలు చెరువులను తలపిస్తుండగా నార్లు మొదలు సాగులోఉన్న పైరు వరకు దెబ్బతింటు-ండంటంతో ఆందోళన చెందుతున్నారు. ఇదే రీతిలో వర్షం కొనసాగితే మరింత నష్టపోతామని.. ఆవేదన చెందుతున్నారు.

ఉమ్మడి వరంల్‌ జిల్లాలో అంచనాకందని నష్టం

వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం.. వర్షాలతో గడిచిన 10 రోజుల్లో ఒక్క వరంగల్‌ జిల్లాలోనే 5 లక్షల ఎకరాల్లో పత్తి పంట ముంపునకు గురైంది. లక్ష ఎకరాల్లో కంది, 50వేల ఎకరాల్లో మొక్కజొన్న, 25వేల ఎకరాల్లో వేరుశనగ, 20వేల ఎకరాల్లో పెసర, 18 వేల ఎకరాల్లోని కూరగాయల పంటలు ముంపునకు గురై పూర్తిగా నాశనమయ్యాయి. నాట్లు వేసిన 2 లక్షల 75 వేల ఎకరాల్లోకి నీరుచేరి భారీగా పంటనష్టం వాటిల్లింది. వరదల ధాటికి అధికశాతం పైరు కొట్టుకుపోగా మిగిలిన చోట్ల ఇసుక మేటలు పేరుకుపోయాయి. వరద నీటి నిల్వ కారణంగా ఇప్పటికే ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, హనుమకొండ, వికారాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో పత్తిపంట మొలకలు ఎర్రబారినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఈ నష్టం అంచనా వేల కోట్ల రూపాయలుగా ఉంటుంది.

నారు పాయె.. నాట్లు పోయే?

ఊహాంచని విధంగా సంభవించిన అతిభారీ వర్షాల ధాటికి వ్యవసాయ రంగానికి తీరని దెబ్బ తగిలింది. రాష్ట్రంలో వరి సీజన్‌ ప్రారంభ దశలో ఉంది. నిజామామాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, వరంగల్‌, హనుమకొండ, ములుగు తదితర జిల్లాల్లో ఇటీవలే నాట్లు మొదలయ్యాయి. మిగిలిన జిల్లాల్లో నాట్లకు రైతులు సిద్ధమవుతున్న తరుణమిది. దాదాపు 40 రోజలు ఆలస్యమైన సీజన్‌తో ఆందోళనకర పరిస్థితుల్లో మొదలుపెట్టిన వరినాట్లకు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా వరదలు ముంచెత్తాయి. కట్టలు తెంచుకున్న వరదలతో పొల్లాల్లోకి నీరు చేరి నాట్లు కొట్టుకుపోతున్నాయి. చెరువులు, వాగులకు సమీప ప్రాంతాల్లోని వరద నీరు వచ్చి పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వరినార్లకు సిద్ధమైన రైతులు వరద ఉద్ధృతితో నాట్లు కొట్టుకుపోతాయని భయపడుతున్నారు. పొలాల్లోకి చేరిన నీటిని బయటకు పంపేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement