Saturday, May 18, 2024

దవాఖానాల్లో వైద్యం మంచిగుండాలే.. అనవసరంగా పేషెంట్లను రిఫర్‌ చేయొద్దు: హరీష్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వైద్యారోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్‌ ఒక్కొక్కటిగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అన్ని విధాలా బలోపేతం చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ ఆస్పత్రులకు వైద్య పరికరాలను సమకూర్చుతున్నామన్నారు. వైద్య ఉపకరణాల సమర్ధ నిర్వహణకు దేశంలోనే తొలిసారిగా ”బయో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటనెన్స్‌” పేరుతో ప్రత్యేక పాలసీ రూపొందించామన్నారు. ఆస్పత్రుల్లోని అన్ని వైద్య పరికరాలు 10 రోజుల్లో ఏఎంసీ కాంట్రాక్టు పరిధిలోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని వైద్య పరికరాల వినియోగం సమర్థవంతంగా జరగాలని స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్వహించారు.

గైనకాలజీ, ఆర్థోపెడిక్‌ సేవలు, ఐపీ, ఓపీ, సి సెక్షన్లు, వైద్య పరికరాల వినియోగం తదితర అంశాల్లో సాధించిన పురోగతిపై సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అం తా కలిసి పని చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. అనవసరంగా పేషెంట్లను హైదరాబాద్‌కు రిఫర్‌ చేయడం తగ్గించాలని తేల్చి చెప్పారు. పేషెంట్లు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. జిల్లా స్థాయిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement