Sunday, May 5, 2024

యువతిపై గ్యాంగ్ రేప్.. కోదాడ పట్టణంలో దారుణం

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ ప‌ట్ట‌ణంలో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ యువ‌తిపై ఇద్ద‌రు యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. కోదాడ పట్టణ చరిత్రలో ఎప్పుడూ జర‌గినటువంటి దారుణమైన ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి రావ‌డంతో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఓ యువ‌తిని మూడు రోజుల క్రితం ఆటోలో బలవంతంగా లాక్కెళ్లి బంధించి, ఆపై మత్తు మందు ఇచ్చి స‌ద‌రు యువ‌కులు అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. ఆ యువతి వారి నుండి తప్పించుకొని బంధువులను ఆశ్రయించి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగు చూసింది.

పట్టణానికి చెందిన మైనార్టీ యువతి తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్, సాయి రామ్ రెడ్డి అనే ఇద్దరు యువకులు శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆటోలో తనను బలవంతంగా లాక్కెళ్లి బాగా కొట్టి కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి ఒంటి మీద దుస్తులు తీసేశారని, ఆ త‌ర్వాత‌ ఏం జరిగిందో కూడా తనకు మత్తులో గుర్తు లేదని మీడియాకు తెలిపింది. ఏదో విధంగా వారి నుంచి తప్పించుకొని బంధువుల వద్దకు చేరి వారి సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపింది. తలకు తీవ్ర గాయాలతో ఉన్న ఆ యువతిని పోలీసులు పట్టణ ప్రభుత్వ ఆస్ప‌త్రికి పంపి చికిత్స చేయించారు.

కాగా యువతి నిందితుల వివరాలు తెలపడంతో ఇద్దరు యువకులను పోలీసులు పోలీస్ స్టేషన్ కి పట్టుకొచ్చి విచార‌ణ చేప‌ట్టారు. కాగా నిందితుల్లో ఒకరు అధికార పార్టీ మహిళా కౌన్సిలర్ కొడుకుగా గుర్తించారు. గ్యాంగ్ రేప్ కు గురైన యువతి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులు ఎస్కె గౌస్, సాయిరాం రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని సీఐ నరసింహారావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement