Friday, May 10, 2024

Exclusive | కారు దిగిన గద్వాల జడ్పీ చైర్​పర్సన్​​.. రేపు కాంగ్రెస్​లో చేరనున్న సరిత​

గద్వాల జిల్లాలో బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. జడ్పీ చైర్‌పర్సన్ సరిత పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను ఇవ్వాల (బుధవారం) అధిష్ఠానానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ వివరాలను స్వయంగా సరిత మీడియాకు వెల్లడించారు. కాగా, బీఆర్ఎస్ ను వీడి ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. రేపు (గురువారం) ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్​లో చేరతారని సమాచారం అందుతోంది.

గద్వాల నియోజకవర్గంలో కొన్నిరోజులుగా ఎమ్మెల్యేకు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు పడడం లేదు. వారి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా సరిత అధికార పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సరిత దంపతులతో చర్చలు జరిపి, కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నారనే ప్రచారమూ ఉంది.

ఇక.. వారు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు (గురువారం) కొల్లాపూర్ లో నిర్వహించాల్సిన సభలో కాంగ్రెస్​ ముఖ్య నేత ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ సభను 30వ తేదీకి వాయిదా వేశారు. అయితే.. వారు అనుకున్నట్టు సరిత దంపతులు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement